RTC Conductor: నిజాయితీ చాటుకున్న మహిళా కండక్టర్
ABN, Publish Date - Jan 23 , 2025 | 04:30 AM
సంగారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ సుజాత విధి నిర్వహణలో నిజాయితీ చాటుకున్నారు.
బస్సులో ప్రయాణికులు మరిచిన బ్యాగు అందజేత
అందులో రూ.4 లక్షల విలువైన బంగారు నగలు
సంగారెడ్డి అర్బన్, జనవరి 22(ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ సుజాత విధి నిర్వహణలో నిజాయితీ చాటుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని కంది గ్రామానికి చెందిన బీహెచ్ఈఎల్ రిటైర్డ్ ఉద్యోగి సత్తయ్య- శామమ్మ దంపతులు మంగళవారం సాయంత్రం లింగంపల్లి- సంగారెడ్డి బస్సులో ప్రయాణించారు. వారు తమ బ్యాగును బస్సులోనే మర్చిపోయి గమ్యస్థలంలో దిగి వెళ్లిపోయారు. ఆ బ్యాగును చూసిన కండక్టర్ సుజాత ఆర్టీసీ అధికారులకు అప్పగించారు.
అందులో రూ.4 లక్షల విలువైన బంగారు నగలతో పాటు బీహెచ్ఈఎల్ జనరల్ ఆస్పత్రి ఓపీ పుస్తకం ఉన్నాయి. ఆ పుస్తకంలోని వివరాల ఆధారంగా ఆర్టీసీ అధికారులు సత్తయ్య దంపతులను పిలిపించి ఆర్టీసీ డీఎం ఉపేందర్ సమక్ష్యంలో బ్యాగును, అందులోని బంగారు నగలను వారికి అప్పగించారు. ఈ సందర్భంగా నిజాయితీ చాటుకున్న కండక్టర్ సుజాతను ఉపేందర్ శాలువాతో సన్మానించి అభినందించారు.
Updated Date - Jan 23 , 2025 | 04:30 AM