సాగర్ నీటి మట్టం 527 అడుగులు
ABN, Publish Date - Jul 07 , 2025 | 12:32 AM
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం ఆదివారం సాయంత్రానికి 527 అడుగులకు చేరుకుంది.
వారంలో 13 అడుగులు పెరుగుదల
నాగార్జునసాగర్, జూలై 6(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం ఆదివారం సాయంత్రానికి 527 అడుగులకు చేరుకుంది. జూన్ 30వ తేదీ నాటికి 514.30 అడుగులుగా ఉన్న సాగర్ నీటి మట్టం ఎగువన ఉన్న శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా సాగర్కు రోజుకు సుమారు 50 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ నీటి మట్టం వారం రోజుల్లో 13 అడుగులు పెరిగి 527 అడుగులకు చేరుకుంది. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 527 అడుగులు (162.3490 టీఎంసీలు)గా ఉంది. సాగర్ నుంచి ఎడమ కాల్వ ద్వారా 3374 క్యూసెక్కుల నీటిని, ఎస్ఎల్బీసీ ద్వారా 1350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి మొత్తం 4,724 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు రెండు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా 57,668 క్యూసెక్కుల నీరు సాగర్కు వచ్చి చేరుతోంది. సాగర్ నుంచి కుడి, వరద కాల్వలకు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి నీరు విడుదల చేయలేదు.
Updated Date - Jul 07 , 2025 | 12:32 AM