నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా.. ఎన్నికలకు సిద్ధం
ABN, Publish Date - Jul 29 , 2025 | 12:39 AM
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం స్థానిక ఎన్నికల నిర్వహణపై తగిన చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల నిర్వహణకు సామగ్రిని సిద్ధం చేసుకోవాలని, సంబంధిత ఖర్చును రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అంచనా వేసి... స్థానికంగా జిల్లా కొనుగోలు కమిటీల ద్వారా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
డీపీవో, జడ్పీ సీఈవోలకు ఎన్నికల సంఘం ఆదేశాలు
ఏర్పాట్లు చేస్తోన్న జిల్లా యంత్రాంగం
ఎన్నికల సిబ్బంది డేటా అప్డేట్
గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్స్ల దిగుమతి
త్వరలోనే ఎంపీవోల బృందం గుజరాత్కు పయనం
ఒకే కుటుంబానికి... ఒకే పోలింగ్ కేంద్రం
ఆంధ్రజ్యోతి-యాదాద్రి): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం స్థానిక ఎన్నికల నిర్వహణపై తగిన చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల నిర్వహణకు సామగ్రిని సిద్ధం చేసుకోవాలని, సంబంధిత ఖర్చును రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అంచనా వేసి... స్థానికంగా జిల్లా కొనుగోలు కమిటీల ద్వారా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందు కు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి, రాష్ట్ర గవర్నర్కు పంపింది. అయితే ఈ బిల్లుకు ఇప్పటివరకు గవర్నర్ ఆమోదం పొందలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడంతో, ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్లో చర్చించి ఆర్డినెన్స్ తీసుకొస్తుందా? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారులు వేచి చూస్తున్నారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబరు 30లోగా గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేస్తోంది. జిల్లాలో 17 జడ్పీటీసీ, 178 ఎంపీటీసీ స్థానాలకు 995 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. జిల్లాలో 427 గ్రామపంచాయతీలు, 3,704 వార్డులకు 3,704 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఓటర్లు మొత్తం 5,32,498 ఉన్నారు. పురుషులు 2,64,765, మహిళలు 2,67,729 మంది, ఇతరులు నలుగురు ఉన్నా రు. గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఓటర్ల జాబితా ప్రకా రం కాకుండా... కొత్త జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం తగిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే మండల స్థాయి ఓటరు జాబితా పూర్తి చేయగా..., తాజాగా గ్రామ యూనిట్గా తీసుకుని జాబితా రూపొందించడం లో పంచాయతీ అధికారులు నిమగ్నమయ్యారు. కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో వచ్చేలా ఓటరు జాబితాను సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. ఎన్నికల తేదీలు ఎప్పుడు ప్రకటించినా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం చేసుకుంటున్నారు.
గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్స్లు
స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ నమూనాలో నిర్వహిస్తారు. గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యులతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీలకు రెండు ఓటరు చీటీల ను వేర్వేరు బ్యాలెట్ బాక్స్ల్లో వేస్తారు. అందుకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,650 బ్యాలెట్ బాక్సు లు అందుబాటులో ఉన్నాయి. మరో 1,260 బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రం నుంచి బ్యాలెట్ బాక్సులను దిగుమతి చేసుకునేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జిల్లాలోని ఎంపీవోల బృందం గుజరాత్కు వెళ్లి... బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు విడతల్లో స్థానిక పోరు
స్థానిక సంస్థల ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని డీపీవో, జడ్పీ సీఈవోలకు ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే పంచాయతీల్లో కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్నారు. గ్రామం యూనిట్గా వార్డులవారీగా ఓటర్ల జాబితా రూపొందిస్తున్నారు. ఈ వివరాలు టీ-పోర్టల్లో నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఎన్నికల సిబ్బంది డేటా సిద్ధం
గ్రామపంచాయతీల ఎన్నికలకోసం పోలింగ్ సిబ్బంది డేటాను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. ఫిబ్రవరిలో తెలంగాణ పోల్ సాఫ్ట్వేర్లో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బందికి సంబంధించిన వివరాలు నమోదుచేశారు. అయితే కొత్తగా నియామకాలు, బదిలీలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల దృష్ట్యా మరోసారి సరి(అ్పడేట్) చేసుకోవాలని సూచించింది. గ్రామపంచాయతీలు, వార్డుల సంఖ్య ఆధారంగా సిబ్బంది వివరాలు ఎన్నికల సంఘానికి నివేదించేందుకు జిల్లాయంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
రెండు విడతల్లో స్థానిక పోరు
గతంలో జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించగా..., ఈసారి రెండు విడతల్లోనే పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది. ఈనేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని డీపీవో, జడ్పీ సీఈవోలకు ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే పంచాయతీల్లో కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్నారు. గ్రామం యూనిట్గా వార్డులవారీగా ఓటర్ల జాబితా రూపొందిస్తున్నారు. ఈ వివరాలు టీ-పోర్టల్ నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని 17 మండలాల్లోని 428 గ్రామపంచాయతీల్లో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో విడతలో ఎనిమిది మండలాల చొప్పున ఎన్నికలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఒక గ్రామంలో 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. 200 మంది ఓటర్లు ఉండే పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్, ఒక పోలింగ్ అధికారి ఉంటారు. 201 నుంచి 400 మంది ఓటర్లుండే చోట ఒక ప్రిసైడింగ్, ఇద్దరు పోలింగ్ అధికారులు, 401నుంచి 650 మంది ఉండే పోలింగ్ కేంద్రాల్లో ఒక ప్రిసైడింగ్, ముగ్గురు పోలింగ్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి ఆర్.సునంద ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు.
Updated Date - Jul 29 , 2025 | 12:39 AM