అకాల వర్షం రూ.2కోట్లకుపైగా నష్టం
ABN, Publish Date - Apr 09 , 2025 | 12:58 AM
తుర్కపల్లి మండలంలో ఈ నెల 3వ తేదీన భారీ ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి రైతులు, మామిడి తోటల యాజమానులకు భారీ నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయంలో వడగళ్ల వాన రైతుల కు కన్నీరు మిగిల్చింది.
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన వడగళ్లవాన
(ఆంధ్రజ్యోతి-తుర్కపల్లి): తుర్కపల్లి మండలంలో ఈ నెల 3వ తేదీన భారీ ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి రైతులు, మామిడి తోటల యాజమానులకు భారీ నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయంలో వడగళ్ల వాన రైతుల కు కన్నీరు మిగిల్చింది. భారీ ఈదురుగాలుల కు మామిడి తోటల్లో కాయలు పూర్తిగా రాలిపోవడంతో మామిడి తోటల యాజమానుల కు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా మండలంలోని తుర్కపల్లి, వాసాలమర్రి, దయ్యంబండతండా, కోనాపూర్, వీరారెడ్డిపల్లి, దత్తాయపల్లి, ముల్కలపల్లి తదితర గ్రామాల్లో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది.
అధికారుల లెక్కల ప్రకారం తుర్కపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో 85 ఎకరాల్లో వరిపంట పూర్తిగా నష్టపోగా, సుమారు రూ.50 లక్షల వరకు రైతులు నష్టం వాటిల్లింది. అంతేకాకుండా సాగుకోసం రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దత్తాయపల్లి తుర్కపల్లి, వాసాలమర్రి, కోనాపూర్, ముల్కలపల్లి గ్రామాల్లో 105.3 ఎకరాల్లో మామిడి తోటలు, రెండు ఎకరాల మిరప, ఎకరం టమాట తోటలకు నష్టం వాటిల్లగా, బొమ్మలరామారం మండలం చీకటిమామిడి, సోలిపేట, తిమ్మాపూర్ గ్రామాల్లో 45.6 ఎకరాలకు తోటలకుగాను 45 మంది రైతులకు నష్టం జరిగింది. మామిడి తోటలకు ఎకరాకు సుమారు రూ.2లక్షల చొప్పున రూ.2కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. బొమ్మలరామారంలో సుమారు రూ.90లక్షల వరకు నష్టం వాటిల్లింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా మండలంలోని ఆయా గ్రామాల్లో ఇప్పటికే 135 ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోయి రైతులు పూర్తిగా నష్టపోయారు. మూడేళ్లుగా భారీ ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్ట పరిహారం రాలేదని, ఆ సారైన తమకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పంట చేను మునికి పోవడంతో 60వేలు నష్టం:ఆకుల మధు కౌలు రైతు తుర్కపల్లి
ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా మండలంలోని వెంకటాపూర్ శివారు ప్రాంతంలో ఉన్న సూదినేని చెరువు నిండి అలుగు పారుతుండడంతో నోటికొచ్చిన పంట ఎకరం పొలం మునిగి పోవడంతో పాటు కొంత వరి పొలం నీటిలో నేల వాలడంతో రూ. 60వేల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. తాను 3ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకోని వరి సాగు చేసానని, పంట నీటిలో మునిగి పోవడంతో పంట సాగుకు చేసిన పెట్టుబడులు, కౌలు డబ్బులు కూడ రాని పరిస్థితి నెలకొంది. తమకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
భారీ ఈదురు గాలులు అకాల వర్షానికి రూ.10లక్షలు నష్టం: ఎండీ శరీఫ్, మామిడి తోట యాజమాని తుర్కపల్లి
ఇటీవల కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షానికి తనకున్న ఐదెకరాల మామిడి తోటలో కాయలు పూర్తి రాలిపోవడంతో సుమారు రూ. 10 లక్షలు నష్టం జరిగింది. అడుగు మందులు, స్ర్పే మందులు తదితర ఖర్చులకు గాను ఎకరాకు 2లక్షల వరకు నష్టం జరిగినట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా అకాల వర్షాలు, భారీ ఈదురు గాలుల కారణంగా నష్ట పోతున్నాను. ప్రతి యేటా అఽధికారులు వచ్చి జరిగిన నష్టం రాసుకుపోతున్నారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి నష్ట పరిహారం అందలేదన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ సారైన తమకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
Updated Date - Apr 09 , 2025 | 12:58 AM