సీపీఎం సీనియర్ నేత రఘుపాల్ కన్నుమూత
ABN, Publish Date - May 19 , 2025 | 12:41 AM
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నేత, అఖిల భారత శాంతి సంఘీభావ సమితి జాతీయ నాయకుడు గంగసాని రఘుపాల్ (83) ఆదివారం మృతిచెందారు.
పార్థీవ దేహం బీబీనగర్ ఎయిమ్స్కు అప్పగింత
సీపీఎం హైదరాబాద్ నగర కార్యదర్శిగా మూడు పర్యాయాలు బాధ్యతలు
బీబీనగర్, రాజాపేట, మే 18 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నేత, అఖిల భారత శాంతి సంఘీభావ సమితి జాతీయ నాయకుడు గంగసాని రఘుపాల్ (83) ఆదివారం మృతిచెందారు. ఆయన తండ్రి గంగసాని గోపాల్రెడ్డి (గబ్బెట గోపాల్రెడ్డి) 1957వ సంవత్సరంలో పీడీఎఫ్ (ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ)నుంచి జనగామ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1942 మే 22న జన్మించిన రఘుపాల్ బీఎస్సీ, ఎల్ఎల్బీ చదివారు. 1964 నుంచి సీపీఎంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 15 సంవత్సరాలు హైదరాబాద్ నగర కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రస్తుతం సీపీఎం అఖిల భారత శాంతి సంఘీభావ సమితి జాతీయ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యానికి గురై హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. రఘుపాల్ మృతికి గ్రామ, మండల అఖిల పక్ష నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. రఘుపాల్కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
భౌతిక కాయం బీబీనగర్ ఎయిమ్స్కు అప్పగింత
తన పార్థ్థీవ దేహాన్ని ఏదైనా మెడికల్ కళాశాలకు పరిశోధనల నిమిత్తం అప్పగించాలనే రఘుపాల్ కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆయన పార్థీవ దేహాన్ని యాదాద్రి భువవనగిరి జిల్లా పరిధిలోని ఎయిమ్స్ మెడికల్ కళాశాలకు అప్పగించారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు సమక్షంలో బీబీనగర్లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మెడికల్ కళాశాలకు పరిశోధనల నిమిత్తం ఆదివారం అప్పగించారు.
చిన్నతనంనుంచే కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడు : బీవీ రాఘవులు
చిన్నప్పటి నుంచే కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడైన నేత రఘుపాల్ జీవితం ఆదర్శనీయమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. రఘుపాల్ భూస్వాముల కుటుంబంలో పుట్టినా అగ్ర కులానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ ఆయన ఏనాడూ కులభావజాలం జోలికి పోలేదన్నారు. నిత్యం పార్టీ కోసం ప్రజాసమస్యలపైనే పోరాటం చేసేవారని చెప్పారు. ఆయన నిరాడంబరమైన జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, సీపీఎం హైదరాబాద్ నగర కార్యదర్శిగా మూడు పర్యాయాలు బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. ఆయన వెంట సీపీఎం రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు పాలడుగు భాస్కర్, జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్, కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, కనకారెడ్డి, రాములు, చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశ, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సోమయ్య, నర్సింహ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - May 19 , 2025 | 12:41 AM