మునిసిపల్ సేవలు ప్రజలకు చేరువలో..
ABN, Publish Date - Jul 13 , 2025 | 12:55 AM
ప్రజలకు మునిసిపల్ సేవలను చేరువ చేసే లక్ష్యంతో ప్రతిపాదించిన వార్డు అధికారులు, వార్డు కార్యాలయ వ్యవస్థ రూపకల్పన తుది దశకు చేరింది. ఇప్పటికే ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా వార్డు అధికారుల నియామకాలు పూర్తి చేసింది.
పట్టణాల్లో వార్డు కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు
మనుగడపై అనుమానాలు?
(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన్): ప్రజలకు మునిసిపల్ సేవలను చేరువ చేసే లక్ష్యంతో ప్రతిపాదించిన వార్డు అధికారులు, వార్డు కార్యాలయ వ్యవస్థ రూపకల్పన తుది దశకు చేరింది. ఇప్పటికే ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా వార్డు అధికారుల నియామకాలు పూర్తి చేసింది. దీంతో ము నిసిపల్ అధికారులు వార్డు కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలలోని 104 వార్డులలో 104 కార్యాలయాలు ప్రారంభించాలని నిర్ణయించారు.
భువనగిరి మునిసిపాలిటీలో 35 వార్డు కార్యాలయాల ఏర్పాటుకు భవనాల గుర్తింపు దాదాపు పూర్తయింది. గుర్తించి న భవనాల్లో తేలికపాటి మరమ్మతులు, రంగులు వేసి అవసరమైన ఫర్నిచర్ను కొనుగోలు చేసేందుకు మునిసిపల్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదే తరహా పరిస్థితి జిల్లాలోని మిగతా 5మునిసిపాలిటీలలో కూడా నెలకొన్నది. అయితే జీ హెచ్ఎంసీలో కొన్నెళ్లక్రితం చేపట్టిన వార్డుఅధికారులు, వార్డు కార్యాలయాలు పలుకారణాలతో క్రమేపీ కనుమరుగయ్యాయి. ఈ నేపథ్యంలో పట్టణాల్లో వార్డు కార్యాలయాల వ్యవస్థ మనుగడపై పలువురు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
వార్డు కార్యాలయాలు...
వేగంగా విస్తరిస్తున్న పట్టణాల వైశాల్యంతోపాటు శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ పని ఒత్తిడి, సిబ్బంది కొరత తదితర కారణాలతో మునిసిపల్ అధికారులు పట్టణ, ప్రజల సమస్యల గుర్తింపు, పరిష్కారంపై పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపలేకపోతున్నారని మునిసిపల్ పరిపాలనా విభాగం భావిస్తోంది. అలాగే ఇంటి నెంబర్ల కేటాయింపు, కొలతల సేకరణ, అసస్మెంట్ పూర్తి స్థాయిలో నిర్వహించకపోవ డం, ఆస్తిపన్ను, నీటి చార్జీల వసూళ్లలో వెనుకబడుతుండడం తో పట్టణాల ఆదాయం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో వార్డు అధికారులు, వార్డు కార్యాలయాల వ్యవస్థ పురుడు పోసుకుం ది. ఈ మేరకు ప్రభుత్వం వార్డు అధికారుల నియామకాలను పూర్తి చేయగా మునిసిపల్ అధికారులు వార్డు కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. వార్డు పరిధిలోని మునిసిపల్ కమ్యూనిటీహాల్ ఇతర మునిసిపల్ భవనాల్లో కార్యాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సరిపడా భవనాలు లేకుంటే రెండు వార్డులకు కలిపి ఒకే కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. అలా కూడా వీలుకాని వార్డులలో అద్దె భవనాలను వెతుకుతున్నారు.
బాధ్యతంతా వార్డు అధికారులదే..
వార్డు అధికారులు, కార్యాలయాల వ్యవస్థ అమల్లోకి వచ్చా క ఆయా వార్డుల సంపూర్ణ బాధ్యత వార్డు అధికారులదే. వార్డులలోని గృహ నిర్మాణ అనుమతుల పరిశీలన, భవనాల కొలతల సేకరణ, నల్లా కనెక్షన్లు, ఆస్తిపన్ను వసూలు, ఇంటి నెంబర్ల కేటాయింపు అసస్మెంట్ పనుల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తుది నిర్ణయానికి పోర్టల్ ద్యారా మునిసిపల్ కార్యాలయానికి నివేదించాల్సి ఉంటుం ది. అంతేకాక వార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను, ఆక్రమణలను గుర్తించి నివేదిస్తారు. పారిశుధ్యం, హరితహారం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణ, అన్ని మార్కెట్ల పరిశీలన, పర్యవేక్షణ తదితర పనులన్నీ వార్డు అధికారులే చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రజలు సేవలు, పనులకోసం మునిసిపల్ కార్యాలయానికి వెళ్లే బదులు బస్తీలోనే ఉండే వార్డు కార్యాలయానికి వెళితే సరిపోతుంది. వార్డు అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది.
కౌన్సిల్ కొలువు తీరాక
అధికారులు భావిస్తున్నట్లు త్వరలోనే వార్డు కార్యాలయాలు అందుబాటులోకి వస్తే ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రస్తుతం కౌన్సిలర్లు లేకపోవడంతో వారి విధులకు ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు. కానీ త్వరలోనే జరుగనున్న ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లతో వార్డు కార్యాలయాల నిర్వహణ, వార్డు అధికారుల విధులపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని అధికారులు కలవరపాటుకు గురవుతున్నట్లు తెలుస్తున్నది. వార్డు సమస్యలు, అభివృద్ధి తన ద్వారానే జరగాలని రాజకీయ నాయకులైన కౌన్సిలర్లు డిమాండ్ చేస్తారని, వార్డు అధికారులు మాత్రం వార్డుల సంపూర్ణ బాధ్యత తమ పైనే ఉంటుందటూ ఇరువర్గాల మధ్య పొరపచ్చాలు తలెత్తే అవకాశాలు ఉంటాయని అధికారులు పరోక్షంగా అంగీకరిస్తున్నారు. జీహెచ్ఎంసీలో వార్డు కార్యాలయాల ప్రయోగం వికటించడానికి ఇవే ప్రధానకారణాలు అని కూడా అంటున్నారు. ఏదేమైనా వార్డు కార్యాలయాల వ్యవస్థ మంచిదే అయినప్పటికీ మనుగడ ఎంతవరకు సాధ్యమని మునిసిపల్ ఎన్నికల తర్వాత తేలనుంది.
ఏర్పాట్లు ఇలా
జిల్లాలోని భువనగిరి, భూదాన్పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, మోత్కూరులో 104 మునిసిపల్ వార్డులున్నాయి. ఈ మేర కు ప్రభుత్వం ఇటీవలవార్డు అధికారుల నియామకాలను పూర్తిచేసింది. అయితే వార్డుల సంఖ్యకు అనుగుణంగా నియామకాలు జరగకపోవడంతో ఒక్కో అధికారికి 2, 3 వార్డులను కేటాయించారు. ఈమేరకు భువనగిరి మునిసిపల్ పరిధిలో 35 వార్డులుండగా ప్రభుత్వం 26 మందిని మాత్రమే టీజీపీఎస్సీ ద్వారా నియమించింది. వీరిలో ముగ్గురికి రెండేసి వార్డుల బాధ్యతలను అప్పగించారు. మిగతా ఆరువార్డులకు బిల్ కలెక్టర్లు, వీఆర్ఏలను అధికారులు నియమించారు. అలా గే సుమారు 32వార్డు కార్యాలయాల భవనాల గుర్తింపు పూర్తి కాగా మూడు వార్డుల కార్యాలయాలకు అద్దె భవనాలను వెతుకుతున్నారు. మిగతా ఐదు మునిసిపాలిటీలలోనూఇదే తరహా పరిస్థితులు ఉన్నాయి.
సత్ఫలితాలు వస్తాయి : జి.రామలింగం, కమిషనర్, భువనగిరి మునిసిపాలిటీ
వార్డు అధికారులు, కార్యాలయాల వ్యవస్థతో సత్ఫలితాలు వస్తాయి. బస్తీలలోని సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయి. వార్డు అధికారులు బస్తీలలోనే ఉంటుండడంతో మునిసిపల్ సేవలు, పనుల కోసం ప్రజలు మునిసిపల్ కార్యాలయం చుట్టూ తిరిగే బాధలు తప్పుతాయి. వార్డు అధికారులు నిర్లక్ష్యం చూపినా, పనులకు ఆటంకం కల్పించినా, అవినీతికి పాల్పడినా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు.
Updated Date - Jul 13 , 2025 | 12:55 AM