నెల ముందుగా సాగర్కు కృష్ణమ్మ!
ABN, Publish Date - Jun 05 , 2025 | 12:15 AM
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఈ ఏడాది రెండు నెలల ముందుగానే కృష్ణమ్మ రానుందా? అంటే నీటిపారుదల శాఖ నిపుణులు అవుననే చెబుతున్నారు.
జూరాల నుంచి శ్రీశైలానికి మొదలైన నీటి విడుదల
గతంలో ఎన్నడూ లేనివిధంగా జూనలోనే
సాగర్ ఆయకట్టుకు జూలైలోనే
(ఆంధ్రజ్యోతి-నాగార్జునసాగర్)
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఈ ఏడాది రెండు నెలల ముందుగానే కృష్ణమ్మ రానుందా? అంటే నీటిపారుదల శాఖ నిపుణులు అవుననే చెబుతున్నారు. గతంలో కృష్ణ పరివాహక ప్రాంతాల్లో జూనలో వర్షాలు కురిస్తే సాగర్కు ఎగువన ఉన్న ప్రాజెక్టులు అన్నినిండిన తర్వాత జూలైలో సాగర్కు వరద రాక ప్రారంభమయ్యేది. ప్రస్తుతం సాగర్కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి వరద రాక రెండు నెలల ముందుగానే ప్రారంభమైంది. జూరాల గరిష్ట నీటిమట్టం 318.81 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.55 మీటర్లుగా ఉంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీటిలో 16,732 క్యూసెక్కులను దిగువన ఉన్న శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 833.90 అడుగులుగా ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జూనలోనే శ్రీశైలానికి జూరాల నుంచి నీటి విడుదల ప్రారంభం కావడంతో సాగర్ ప్రాజెక్టుకు నీటి రాక ముందే వస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జూన చివరి నాటికి వరదరాక ప్రారంభం కావచ్చునని ఆయకట్టు రైతులు, ప్రాజెక్టు అధికారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితి..
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590(312.5050 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 511.80(134.7466టీఎంసీలు)అడుగులుగా ఉంది. సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 4,050 క్యూసెక్కులు, ఎడమ కాల్వ, వరద కాల్వ, ప్రధాన జలవిద్యుత కేంద్రానికి ఎటువంటి నీటి విడుదల లేదు. ఎస్ఎల్బీసీ ద్వారా 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి మొత్తం 4,500 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా ఎగువ నుంచి ఎటువంటి నీటి రాక లేదు.
ప్రతీ ఏడాది ఆగస్టులోనే ...
ప్రతీ ఏడాది సాగర్ ఎడమకాల్వ ఆయకట్టుకు ఆగస్టులోనే సాగు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు వరద రాకపోవడంతో 2023-24 వ్యవసాయ సంవత్సరాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్రాప్ హాలిడేగా ప్రకటించింది. దీంతో ఆ ఏడాది సాగర్ ప్రాజెక్టు ఎడమకాల్వ ఆయకట్టులో బోర్లు, బావుల కింద సుమారు లక్ష ఎకరాలు మాత్రమే సాగు చేశారు. సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఎడమ కాల్వ పరిధిలో నల్లగొండ, ఖమ్మం జిల్లాలో సాగవుతున్న ఆరు లక్షల ఎకరాలు సాగునీరు లేక పోవడంతో 2023 వ్యవసాయ సంవత్సరంలో బీళ్లుగా మారాయి. 2024-25 వ్యవసాయ సంవత్సరంలో సాగర్కు ఎగువ నుంచి వరద రాక జూలైలో ప్రారంభం కావడంతో ఆగస్టు 2వ తేదీ నుంచి ఎడమ కాల్వకు వానాకాలం సాగుకు నీటిని విడుదల చేశారు.
Updated Date - Jun 05 , 2025 | 12:15 AM