1,165మందికి ఇందిరమ్మ ఇళ్లు
ABN, Publish Date - Jun 05 , 2025 | 12:18 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లాంఛనంగా ప్రారంభమైంది.
నాలుగు దఫాలుగా రూ.5లక్షలు మంజూరు
అనర్హులుగా తేలినా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినా రికవరీ
భువనగిరి టౌన, జూన 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లాంఛనంగా ప్రారంభమైంది. మొదటి దఫాలో సొంత ఇంటి స్థలాలు కలిగిన వారికి ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5లక్షల చొప్పున అందజేసే ప్రొిసీడింగ్స్ను అందజేశారు. అయితే ప్రతి లబ్ధిదారుడు ఖచ్చితంగా ఇంటిని నిర్మించుకోవాల్సిందేనని లేని పక్షంలో అర్హుల జాబితా నుంచి తొలగిస్తామని, దఫాల వారీగా అందజేసిన మొత్తాన్ని రికవరీ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నియమ నిబంధనలను లబ్ధిదారులకు ఇస్తున్న ప్రొసిడింగ్స్లో పొందుపర్చారు. ఈ మేరకు నిబంధనలు ఇలా ఉన్నాయి..
మొదటి దఫాగా 1165 మందికి..
భువనగిరి పట్టణం, మండలంలో కలిపి మొదటి దఫాలో 1165 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. తదుపరి దఫాల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు లభిస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భువనగిరి మునిసిపల్ పరిధిలోని 35 వార్డులకు గాను మొదటి దఫాలో 492 మందికి ఇందిరమ్మ ఇందిరమ్మ ఇళ్లు లభించాయి. అత్యధికంగా 14వ వార్డులో 39 మందికి అత్యల్పంగా 10, 33, 34వ వార్డులలో ఇద్దరికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు లభించాయి.
వార్డుల వారీగా లబ్ధిదారుల సంఖ్య ఇలా..
1వ వార్డు (6), 2వ (28), 3వ (12), 4వ (18), 5వ (14), 6వ (19), 7వ (29), 8వ (31), 9వ (10), 10వ (2), 11వ (20), 12వ (8), 13వ (8), 14వ (39), 15వ (4), 16వ (3), 17వ (10), 18వ (17), 19వ (5), 20వ (25), 21వ (5), 22వ (12), 23వ (21), 24వ (34), 25వ (15), 26వ (15), 27వ (3), 28వ (11), 29వ (9), 30వ (7), 31వ (16), 32వ (21), 33వ (2), 34వ (2), 35వ వార్డు (11).
భువనగిరి మండలంలో 33 గ్రామాలకు గాను మొదటి దఫాలో 673 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యా యి. అత్యధికంగా బండసోమారం గ్రామంలో 116 మందికి, అత్యల్పం గా సిరివేణికుంటలో కేవలం ఐదుగురికే ఇందిరమ్మ ఇళ్లు లభించాయి. అయితే ఈ పాటికే 45మంది బేస్మెంట్ లెవల్, 8మంది స్లాబ్ లెవల్ పూర్తి చేసి రూ.53లక్షలు బిల్లులు పొందినట్లు అధికారులు తెలిపారు.
గ్రామాల వారీగా లబ్ధిదారుల సంఖ్య ఇలా..
బండసోమారం (116), హన్మపూర్ (39), బొల్లెపల్లి (36), అనాజిపురం, అనంతారం, వీరవెల్లి (30 చొప్పున), చందుపట్ల (29), బస్వాపూర్ (27), తుక్కాపూర్ (24), కూనూరు, తాజ్పూర్, వడపర్తి (20 చొప్పున), చీమలకొండూరు, నందనం, ముత్తిరెడ్డిగూడె (19 చొప్పున), గౌస్నగర్, నాగిరెడ్డిపల్లి, రెడ్డినాయక్ తండా, సూరేపల్లి (15 చొప్పున), నమాతపల్లి, పచ్చర్లబోడు తండా (14 చొప్పున), వడాయిగూడెం (11), ఆకుతోటబావి తండా, బాలంపల్లి, కేసారం, మన్నెవారిపంపు, పెంచికల్పహాడ్, రామచంద్రపూర్ (10 చొప్పున), ముస్త్యాలపల్లి (9), ఎర్రంబెల్లి (7) గంగసానిపల్లి, జమ్మాపూర్ (6 చొప్పున), సిరివెనికుంట (5).
నిబంధనలు ఇలా..
1) ప్రొసిడింగ్స్ అందిన 45 రోజుల లోపు ఇంటి నిర్మాణం ప్రారంభించి ఏడాది లోపు పూర్తి చేయాలి.
2) 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా ఆర్సిసి స్లాబ్తో నిర్మించాలి. తప్పనిసరిగా రెండు గదులతో పాటు వంటగది మరుగుదొడ్డి ఉండాలి.
3) ఇంటి నిర్మాణం పూర్తయ్యాక కూడా పథకానికి అనర్హులుగా తేలినా, నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు నిర్మించినా మంజూరును రద్దు చేసి అప్పటి వరకు చెల్లించిన బిల్లులను ఆర్ఆర్ చట్టం ప్రకారం రికవరీ చేస్తారు.
4) ఇంటి నిర్మాణానికి మంజూరైన రూ.5లక్షలను నాలుగు దఫాలుగా మంజూరు చేస్తారు. మొదటి బిల్లు బేసెమిట్ నిర్మించాక రూ.1లక్ష, రెండో బిల్లు గోడలు కట్టాక రూ.1లక్ష, మూడో బిల్లు స్లాబ్ వేసిన తర్వాత రూ.2లక్షలు, చివరి బిల్లు (మరుగుడొడ్డి, ప్లాస్టింగ్, తలుపులు బిగించాక) రూ.1లక్ష.
Updated Date - Jun 05 , 2025 | 12:18 AM