నిశీధిలో ప్రయాణం .. ప్రాణమే ఫణం
ABN, Publish Date - May 09 , 2025 | 12:01 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాత్రీ, పగలు తేడా లేకుండా నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై యూటర్న్(కుడివైపు తిరిగే ప్రాంతం)లు సామాన్యుల జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాత్రీ, పగలు తేడా లేకుండా నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై యూటర్న్(కుడివైపు తిరిగే ప్రాంతం)లు సామాన్యుల జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో హైమాస్ట్ లైట్లు లేక, ఉన్నా వెలగకపోవడంతో రాత్రి వేళ రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు భద్రతను, ప్రయాణికుల సంరక్షణను చూడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజల ప్రాణాలు చీకట్లో గాలిలో కలిసిపోతున్నాయి. ఇటీవల బ్లాక్స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్న అధికారులు యూటర్న్ల వద్ద జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోయారు.
(ఆంధ్రజ్యోతి-చిట్యాలరూరల్/చిట్యాల )
నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి సుమారు 19కిలోమీటర్లు ఉంటుంది. గుండ్రాంపల్లి నుంచి మొదలై వెలిమినేడు, పెద్దకాపర్తి, చిట్యాల, వట్టిమర్తి బస్స్టేజీ వరకు రహదారి విస్తరించి ఉంది. ఈ హైవేపై ఆరు బ్లాక్స్పాట్లుగా యూటర్న్లను అధికారులు గుర్తించారు. అందులో గుండ్రాంపల్లి డబుల్బెడ్రూం సమీపంలో, సుర్కంటిగూడెంకు వెళ్ళే దారి వద్ద, వెలిమినేడు దాటాక శివారులో పిట్టంపల్లి వెళ్లే దారి వద్ద, పెద్దకాపర్తి శివారులో చెరువు వద్ద, చిట్యాల రైల్వేస్టేషనకు వెళ్ళేదారిలో, వట్టిమర్తి బస్స్టేజి వద్ద ఉన్నాయి.
14 యూటర్న్లు.. ఒక చోటే హైమాస్ట్
(ఆంధ్రజ్యోతి-చౌటుప్పల్ రూరల్)
చౌటుప్పల్ మండలం తూఫ్రానపేట నుంచి గుండ్లబావి వరకు 14యూటర్న్లు ఉన్నాయి. అంకిరెడ్డిగూడెం యూటర్న్ వద్ద దివీస్ సంస్థ హైమాస్ట్ లైట్లు ఏర్పాటుచేసింది. మిగతా ఏ ప్రాంతంలోనూ హైమాస్ట్ లైట్లులేవు. ఇందుకోసం జాతీయ రహదారుల సంస్థ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో యూటర్న్ల వద్ద రాత్రి వేళ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సిగ్నలింగ్ వ్యవస్థ, స్పీడ్ బ్రేకర్లు, బారీకేడ్లు వంటి నివారణ చర్యలు లేవు. దీంతో ఈ ప్రాంతంలో ప్రమాదాలు నిత్యకృత్యమై అనేక మంది మృత్యువాత పడుతున్నారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. ఽధర్మోజిగూడెం వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుండడంతో ఆ ప్రాంతాల్లో అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నారు.
రోడ్డు దాటడం ప్రధాన సమస్య
వివిధగ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు యూటర్న్ వద్ద రోడ్డు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. హైమాస్ట్ లైట్లు లేక రాత్రి వాహనాల రాక కనిపించకపోవడంతో చీకట్లో వేగంగా రావడంతో ప్రమాదాలు జరుతున్నాయి.
చిట్యాల పట్టణంలో జాతీయరహదారి పైన, సర్వీ్సరోడ్డులో ఏర్పాటుచేసిన హైమాస్ట్ లైట్లు వెలగడంలేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లైట్లు ఎప్పుడు వెలుగతాయో, ఎప్పుడు వెలగవో తెలియని పరిస్థితి నెలకొంది. హైవేపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ కొంతమేర సర్వీ్సరోడ్డులోనే వెళ్తోంది. ఇక్కడ లైట్లు వెలగకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
నార్కట్పల్లి: నార్కట్పల్లి పరిధిలోని హైదరాబాద్-విజయవాడ హైవేపై గోపలాయపల్లి ఆర్చి వద్ద యూ టర్న్ ఉంది. దీంతో పాటు నల్లగొండ ఫ్లైఓవర్ బ్రిడ్జి, నార్కట్పల్లి పట్టణం నుంచి కామినేని ఆసుపత్రికి వెళ్లే రోడ్డులో ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు వద్ద భారీ హైమాస్ట్ లైట్ల ఏర్పాటుచేసి నిర్వహణ గాలికొదిలేయడంతో వెలగక రాత్రివేళ ప్రమాదాలబారిన పడుతున్నారు. గోపలాయపల్లి దేవాలయ ఆర్చి వద్ద రాత్రివేళ యూటర్న్ చేయడానికి ముఖ్యంగా ద్విచక్ర వాహనచోదకులు భయపడుతున్నారు.
పోలీసులకూ తప్పని తిప్పలు
మునగాల : సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో హైవే ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రమాదాలు తగ్గడం లేదు. యూటర్న్ల వద్ద హైమాస్ట్, సిగ్నల్ లైట్స్, ప్రమాద చూచిక బోర్డులు ఏర్పాటుచేయకపోవటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మునగాల మండలం మాధవరం,మొద్దులచెర్వు, తాడ్వాయి, మునగాల, ముకుందాపురం, ఆకుపాముల వద్ద ఉన్న యూటర్న్ల సిగ్నల్ ఇండికేటర్ లైట్స్, హైమాస్ట్ లైట్స్, ప్రమాదచూచిక బోర్డులు ఏర్పాటుచేయకపోవడంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రమాదాల నివారణకు వనవే స్టాప్ బోర్డులను ఏర్పాటుచేశారు. పగటిపూట గమనించి నెమ్మదిగా వెళ్తున్నారు. కానీ రాత్రి వేళ వెళుతురు లేక అతివేగంగా వచ్చే వాహనాలు స్టాప్బోర్డులకు ఢీకొంటున్నాయి. ఇలా ఢీకొన్న ప్రతీసారి నూతన బోర్డులు ఏర్పాటుచేయలేక పోలీస్ యంత్రాంగం కూడా నానా ఇబ్బందులు పడుతోంది.
ఆరుచోట్ల..
కేతేపల్లి : కేతేపల్లి మండలంలో దాదాపు 10 కిలోమీటర్ల మేర హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరించి ఉంది. ఈ రహదారిపై మండలంలోని ఇనుపాముల మల్లన్నగుట్ట వద్ద, కొర్లపహాడ్ బస్స్టేజీ వద్ద, మండల కేంద్రం కేతేపల్లిలోని డీపౌల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వద్ద, ఎస్సీ కాలనీ వద్ద, చీకటిగూడెం బస్స్టేజీ వద్ద, ఉప్పలపహాడ్ సమీపంలో మొత్తంగా ఆరు యూటర్న్లు ఉన్నాయి. హైవే మీదుగా దూర ప్రాంతాలకు అత్యంత వేగంగా వెళ్లే వాహనచోదకులు రహదారిపై ఈ యూటర్న్లను గుర్తించేలా చర్యలు మాత్రం చేపట్టలేదు. చీకటిగూడెం బస్స్టేజీ వద్ద గల యూటర్న్ వద్ద మాత్రమే సోలార్తో పనిచేసే బ్లింకర్లు, డేంజర్ లైట్లను ఏర్పాటుచేశారు. రహదారి వెంట గ్రామాల ప్రజలు, మూగజీవాలు ఈ యూటర్న్ల వద్ద రోడ్డును దాటేందుకు యత్నించే క్రమంలో రహదారిపై వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
Updated Date - May 09 , 2025 | 12:01 AM