విద్యుదాఘాతానికి గురైన రైతు
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:00 AM
విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన రైతు ప్రాణాలను 108 వాహన సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడారు.
సకాలంలో సీపీఆర్ చేసిన 108 సిబ్బంది
వేములపల్లి, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన రైతు ప్రాణాలను 108 వాహన సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం శివారులో మంగళవారం జరిగింది. బాధిత రైతు కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మాడ్గులపల్లి మండలం ఇస్కబాయిగూడెం గ్రామానికి చెందిన రైతు వల్లపుదాసు చంద్రయ్య వేములపల్లి గ్రామ శివారులోని తన పొలంలోని బోరుబాయి వద్ద మోటార్ బిగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. సమీపంలోని రైతు మంచికంటి వెంకట్రెడ్డి గమనించి ఫోన ద్వారా 108 వాహన సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది వెలిజాల సైదులు, పగిళ్ల జానకిరాములు అపస్మారక స్థితిలో ఉన్న చంద్రయ్యకు సీపీఆర్ అందించగా స్పృహలోకి వచ్చాడు. వెంటనే అతడిని 108 వాహనంలో మెరుగైన వైద్య చికిత్స కోసం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సకాలంలో చంద్రయ్యకు ప్రథమ చికిత్స అందించి ప్రాణాలను కాపాడిన 108 సిబ్బందిని వారి కుటుంబసభ్యులు, రైతులు అభినందించారు.
Updated Date - Jul 02 , 2025 | 12:00 AM