కొను‘ఘొల్లు’!
ABN, Publish Date - Apr 26 , 2025 | 12:24 AM
ధాన్యం విక్రయానికి రైతులకు అవస్థలు తప్పడం లేదు. మిల్లుల వద్ద ధాన్యం కొనుగోళ్లపై నియంత్రణ లేకపోవడంతో మిల్లర్లు చెల్లించే ధరకే సన్న ధాన్యం విక్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కాంటాల కోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
ధాన్యం విక్రయానికి రైతుల అవస్థలు
కేంద్రాల వద్ద కాంటాల కోసం పడిగాపులు
రవాణా, కాంటాల జాప్యంతో ఆవేదన
బతిమాలితే తప్ప కొనుగోలు చేయని మిల్లర్లు
ఏపీ రాష్ట్రం, పొరుగు జిల్లాల నుంచి భారీగా వస్తున్న ధాన్యం
(ఆంధ్రజ్యోతిప్రతినిధి, నల్లగొండ): ధాన్యం విక్రయానికి రైతులకు అవస్థలు తప్పడం లేదు. మిల్లుల వద్ద ధాన్యం కొనుగోళ్లపై నియంత్రణ లేకపోవడంతో మిల్లర్లు చెల్లించే ధరకే సన్న ధాన్యం విక్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కాంటాల కోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సన్న ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా, మిల్లర్లు పచ్చి ధాన్యా న్ని కొనుగోలుచేస్తారని ధర తగ్గినా, బోనస్ కోల్పోతున్నా మిల్పాయింట్ల వద్దే రైతులు విక్రయిస్తున్నారు.
రైతుల అవసరాన్ని ఆసరా చేసుకొని ధాన్యంలో నాణ్యత లేదని, మద్దతు ధర చెల్లించేది లేదని మిల్లర్లు మొండికేస్తుండగా రైతులు బతిమాలితేనే ధాన్యం కొనుగోలుచేసే పరిస్థితి ఉమ్మ డి జిల్లాలో ఉంది. ఏపీ రాష్ట్రంతోపాటు, తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి మిల్లులకు భారీగా ధాన్యం తరలివస్తుండడంతో మిల్లర్లు స్థానిక రైతులకు ధరలో కోత విధిస్తున్నారు. సీజన్ ఆరంభంలో క్వింటాకు రూ.2700 ధర చెల్లించిన మిల్లర్లు ప్రస్తుతం రూ. 2200 నుంచి రూ.2400కు మించి ఇవ్వడం లేదు.యాదాద్రి జిల్లాలో సన్నధాన్యం 20వేల మెట్రిక్టన్నులకు మించి ఉండదని అంచనావేయగా, దొడ్డురకాలు 5లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనావేశారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మాత్రం సుమారు 12.50 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం వస్తుందని అంచనావేశారు. మరో 13లక్షల మెట్రిక్టన్నుల దొడ్డురకాల ధాన్యం ఈ జిల్లాలో వస్తుందని చెబుతున్నారు. అందులో నల్లగొండ, సూర్యాపేట జిల్లా ల్లో ఇప్పటి వరకు ప్రభుత్వ కొనుగో లు కేంద్రాలకు సన్నధా న్యం కేవలం 17వేల మెట్రిక్టన్నులలోపే వచ్చింది. దొడ్డురకం ధాన్యం మూడు జిల్లాల్లో కలిపి సుమారు 2.54 లక్షల మెట్రిక్టన్నులమేర కొనుగోలు చేశారు.
సూర్యాపేట జిల్లాలో కొనుగోళ్లలో జాప్యం
సూర్యాపేట జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలులో తీవ్రజాప్యం జరుగుతోంది. ఈ సీజన్లో జిల్లాలో 4లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం కొనుగో లు చేయాలని నిర్ణయించగా, ఇప్పటివరకు కేవ లం 56వేల మెట్రిక్టన్నుల ధాన్యమే కొనుగోలు చేశారు. అందులో సన్నధాన్యం 13వేల మెట్రిక్టన్నులకే పరిమితమైంది. జిల్లాలో మొత్తం 327 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, అందు లో 76 కేంద్రాలు సన్నధాన్యానికి కేటాయించా రు. తేమశాతం ఎక్కువగా ఉందని కాంటాలు వేయడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా లారీలు వెనువెంటనే రాకపోవడంతో కేంద్రాల వద్ద ధాన్యం భారీగా నిల్వ ఉంటోంది. దీంతో కాంటాలు వేయకుండా జాప్యం చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. ప్రధానంగా జిల్లాలో ఆయకట్టు ప్రాంతంలో ఈ సమస్య అధికంగా ఉంది. ఇదే అదనుగా హమాలీలు సైతం కాంటాలకు అదనపు రుసుము డిమాండ్ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. అకాలవర్షాలు, గాలిదుమారాలతో ధాన్యం కాపాడుకోవడం ఇబ్బందికరంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కాంటాలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మిల్లుల్లో ధాన్యం దిగుమతి చేసుకునే పరిస్థితి లేకపోతే గోదాములకు తరలించాలని కోరుతున్నారు.
యాదాద్రి జిల్లాలో ఇప్పుడిప్పుడే ప్రారంభమైన తాకిడి
యాదాద్రి జిల్లాలో ఇప్పుడిప్పుడే వరికోతలు పూర్తికావస్తున్నాయి. కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకుంటున్న రైతులు ఇప్పుడిప్పుడే కేంద్రాలకు ధాన్యం తీసుకువస్తున్నారు. జిల్లాలో ఈ సీజన్లో కనీసం 3లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించి 297 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో సన్నధాన్యం దిగుబడి అతి స్వల్పంగా 20వేల మెట్రిక్టన్నులకు లోబడే ఉంటుందని, కొనుగోలు కేంద్రాలకు సన్నధాన్యం రాదని అంచనావేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 14వేల మెట్రిక్టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. జిల్లాలో మరో నెలరోజులపాటు ధాన్యం కొనుగోళ్లు జరపాల్సి ఉంటుందనే అంచనాతో కేంద్రాల నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. రైతులకు టోకెన్లు ఇస్తూ కొనుగోళ్లలో ఇబ్బందుల్లేకుండా చూస్తామని పౌరసరఫరాలశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
బతిమిలాడితేనే మిల్లర్ల కొనుగోలు
మిర్యాలగూడ డివిజన్లోని రైస్మిల్లుల వద్ద ఉమ్మడి జిల్లా రైతులు తీసుకువచ్చే ధాన్యానికి సరైన ధర దక్కడం లేదు. ప్రధానంగా మిల్పాయింట్ల వద్దకు రాష్ట్రంలోని నిజామాబాద్, ఖమ్మం, పాలమూరు జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఏపీ రాష్ట్రంలోని పల్నాడు, కృష్ణాజిల్లాల నుంచి ధాన్యం భారీగా వస్తోంది. నాణ్యత ఉండడంతో పాటు, మిల్పాయింట్ల వద్దకు వచ్చి మరీ డెలివరీ ఇస్తుండడం, ధర క్వింటాకు రూ.2,300కు లోబడే తీసుకుంటుండటంతో మిల్లర్లు ఈ ధాన్యం కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో స్థానిక ఉమ్మడి జిల్లా రైతులు తీసుకువస్తున్న సన్నధాన్యానికి ధర దక్కడం లేదు. సీజన్ ఆరంభంలో మిల్పాయింట్ల వద్ద క్వింటాకు రూ.2,700 వరకు ధర ఇచ్చారని, ఇప్పుడు నాణ్యత లేదని, తాలు ఎక్కువగా వస్తోందని సాకులు చెబుతూ కనీస మద్దతు ధరకే పరిమితం చేస్తున్నారని, అదికూడా కొనుగోలు చేసేది లేదని మొండికేస్తూ, బతిమాలించుకుని కొనుగోళ్లు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిల్లుల వద్ద గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు : టీ.సత్తిరెడ్డి, అంతయ్యగూడెం, నల్లగొండ జిల్లా
బోరుకింద ఐదెకరాల్లో చింట్లు రకం సన్న ధాన్యం సాగుచేశా. సుమారు 150 క్వింటాళ్ల ధాన్యం మూడు ట్రాక్టర్లలో తీసుకువచ్చాం. మిల్లర్లు కొనుగోలు చేయకపోవడంతో మిల్లు, మిల్లు తిరిగి బతిమలాడా. చివరికి ఓ మిల్లర్ రూ.2,370 ధర చెల్లించి కొనుగోలు చేశాడు. సీజన్ ఆరంభంలో ఇదే రకం ధాన్యానికి రూ.2,700 వరకు చెల్లించారు. ప్రస్తుతం ధర తగ్గించినా, తప్పనిపరిస్థితిలో విక్రయించి వెళ్తున్నాం. మద్ధతు ధర ఇస్తున్నారు కాబట్టి మిల్లర్లపై ఎక్కువ ధర విషయంలో ఒత్తిడి చేయలేమని అధికారులు చెప్పి తప్పించుకుంటున్నారు.
బతిమాలితే తప్ప కొనడం లేదు : ఇసుబ్, గోగువారిగూడెం, నల్లగొండ జిల్లా
ఎకరం పొలంలో చింట్లు రకం సాగు చేశా. 33 క్వింటాళ్ల దిగుబడి రాగా, మిల్లు వద్దకు తీసుకువచ్చాం. నాణ్యతలేదని ధర తగ్గించారు. చివరికి బతిమిలాడితే క్వింటాకు రూ.2,270 ధర చెల్లించారు. ఇదే రకం ధాన్యాన్ని సీజన్ ప్రారంభంలో తెచ్చినవారికి రూ.2,600 వరకు ఇచ్చారు. ఇప్పుడు ఏపీ రాష్ట్రం నుంచి తక్కువ ధరకు ధాన్యం వస్తుండటంతో మా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. అధికారులు చూస్తున్నారే తప్ప రైతులకు మేలు చేసే పనులు చేయడం లేదు.
10రోజులైనా కాంటాలు వేయలేదు : అవిరే అప్పయ్య, ఆత్మకూరు(ఎస్), సూర్యాపేట జిల్లా
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి 10 రోజులవుతున్నా కాంటాలు వేయడం లేదు. లారీలు రావడం లేదని కొన్ని రోజులు, తేమశాతం ఎక్కువగా ఉందని మరి కొన్ని రోజులు కాంటాలు వేయకుండా గడుపుతున్నారు. మిల్లుల వద్ద హమాలీలు బస్తాకు రూ.8 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వాన, గాలితో ఇబ్బందిపడుతున్నాం. సుమారు 112 బస్తాల ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చా. తక్షణమే ప్రభుత్వం కేంద్రాల నిర్వహణపై దృష్టిసారించి, వెంటనే కాంటాలు వేసేలా చర్యలు తీసుకోవాలి.
కేంద్రానికి వచ్చి 15 రోజులైంది : భైరగోని అనూరాధ, రాయినిగూడెం, నల్లగొండ జిల్లా
నేను సుమారు 25 బస్తాల ధాన్యాన్ని దుప్పలపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 15 రోజులు అవుతోంది. ధాన్యం పచ్చిగా ఉందని, లారీలు రావడం లేదని కాంటాలు వేయడం లేదు. ధాన్యం బాగా వస్తుండడంతో సీరియల్ ప్రకారం కాంటాలు వేస్తున్నారు. దీంతో జాప్యమవుతోంది. వర్షం వస్తే ధాన్యం తడుస్తుందని భయమవుతోంది. వేగంగా కాంటాలు వేసి కొనుగోలు చేయాలి.
నల్లగొండ జిల్లాలో కిక్కిరిసిన కొనుగోలు కేంద్రాలు
నల్లగొండ జిల్లాలో వరి కోతలు దాదాపు ముగియడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ధాన్యం రాశులతో కిక్కిరిసిపోతున్నాయి. ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా వేలాది బస్తాల ధాన్యం నిల్వ ఉంది. కేంద్రాల వద్దనే రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. భారీగా ధాన్యం వస్తుండడంతో లారీల కొరత ఏర్పడిం ది. దీంతో కాంటాల కోసం రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఒక్కో రైతు కనీసం 10 నుంచి 15 రోజుల వరకు ధాన్యం విక్రయించడానికి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సన్నధాన్యం దాదాపుగా మిల్పాయింట్ల వద్దనే విక్రయిస్తుండగా, దొడ్డు ధాన్యం పూర్తిగా కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. జిల్లాలో యాసంగి సీజన్లో 12.14లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనావేయగా, అందులో 11.28లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం మార్కెట్కు వస్తుందని, మిల్లర్లు 5.70లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తారని అధికారులు అంచనావేశా రు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సుమారు 5.70లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించా రు. జిల్లాలో సన్నధాన్యం కొనుగోలుకు 71 కేం ద్రాలు ఏర్పాటు చేయగా, దొడ్డురకం ధాన్యం కోసం 304 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు సన్నధాన్యం కేవలం 3,524 మెట్రిక్ టన్నులు మాత్రమే ఈ కేంద్రాల్లో సేకరించగా, దొడ్డురకం ధాన్యం సుమారు 1.96లక్షల మెట్రిక్టన్నులు కొనుగోలు చేశారు.
రవాణా, కాంటాల్లో జాప్యం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు తీవ్ర జాప్యమవుతున్నాయి. కేంద్రాల వద్ద ఎక్కడ చూసినా వేలాదిబస్తాల ధాన్యం అలాగే ఉంటోంది. సరిపడా లారీలు లేకపోవడం, మిల్లు లు, గోదాముల వద్ద వెంటనే దిగుమతి చేసుకోకపోవడం తదితర కారణాలతో రవాణా తీవ్ర జాప్యమవుతోంది. అదే సమయంలో తేమశాతం ఎక్కువగా ఉందని, తాలు ఉంటుందని చెబు తూ నిర్వాహకులు కాంటాలు వేయడంలో జాప్యం చేస్తున్నారని పలు కేంద్రాల వద్ద రైతు లు వాపోతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ధాన్యం కొనుగోలు చేసే దిక్కేలేకపోవడంతో చేసేదేమీలేక 15 రోజుల వరకైనా వేచి ఉండి, ధాన్యం కాంటాలు వేయించి వెళ్తున్నామని రైతులు చెబుతున్నారు.
Updated Date - Apr 26 , 2025 | 12:24 AM