కూలీలను తరలిస్తున్న ఆటో బోల్తా
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:01 AM
కూలీలను తరలిస్తున్న ఆటో బోల్తాపడిన ప్రమాదంలో మహిళా కూలీ మృతి చెం దగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
మహిళా కూలీ మృతి, మరో ఆరుగురికి గాయాలు
ఆత్మకూరు(ఎస్), ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): కూలీలను తరలిస్తున్న ఆటో బోల్తాపడిన ప్రమాదంలో మహిళా కూలీ మృతి చెం దగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్ఐ శ్రీకాంతగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన 15మంది మహిళలు ఆత్మకూరు(ఎస్) మండలం బొప్పారం, శెట్టిగూడెం గ్రామాల్లో మిరపకాయలు ఏరే కూలి పనిమీద అదే గ్రామానికి చెందిన కేశరాజుపల్లి శంకర్ ఆటోలో తెల్లవారుజామున టేకుమట్ల నుంచి బయలుదేరి బొప్పారం, శెట్టిగూడెం గ్రామాలకు వెళ్తున్నారు. మార్గమధ్యలో కోటపహాడ్ గ్రామ శివారు చెరువు కట్ట వద్ద కుక్క అడ్డం రావడంతో ఆటోడ్రైవర్ తప్పించబోయే క్రమంలో ఆటో రోడ్డుపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని మహిళా కూలీ మాదరబోయిన యాదమ్మ(50) తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఆరుగురు మహిళా కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108వాహనంలో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సనిమిత్తం తరలించారు. యాదమ్మ కుమారుడు మాదరబోయిన లింగయ్య ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ కేశరాజుపల్లి శంకర్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంతగౌడ్ తెలిపారు. యాదమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. యాదమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు
Updated Date - Apr 17 , 2025 | 12:02 AM