ఎస్సారెస్పీ కాల్వలకు మరమ్మతులేవీ?
ABN, Publish Date - Jun 06 , 2025 | 12:15 AM
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) రెండో దశ కింద 20 ఏళ్ల కిందట రూ.1,100 కోట్లతో 69, 70, 71 డీబీఎం మెయినకాల్వలు, ఉప కాల్వలను తవ్వారు. అయినప్పటికీ నేటికీ చివరి భూములకు నీరందడం లేదు.
పాలకులు మారుతున్నా, మారని కాల్వల రూపురేఖలు
10 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు
లస్కర్ల నియామకం ఎప్పుడో
(ఆంధ్రజ్యోతి-అర్వపల్లి)
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) రెండో దశ కింద 20 ఏళ్ల కిందట రూ.1,100 కోట్లతో 69, 70, 71 డీబీఎం మెయినకాల్వలు, ఉప కాల్వలను తవ్వారు. అయినప్పటికీ నేటికీ చివరి భూములకు నీరందడం లేదు. ఎస్సారెస్పీ కాల్వలను 2.44 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించే లక్ష్యంతో రూపకల్పన చేశారు. జనగాం జిల్లా కొడకండ్ల వద్ద ఉన్న బయ్యన్నవాగు నుంచి శ్రీరాంసాగర్ రెండో దశ కాల్వలకు నీటిని విడుదల చేస్తారు. జిల్లాలోని తిరుమలగిరి మండలం వెలిశాల సమీపంలో 69, 70, 71 డీబీఎం మెయిన కాల్వలలోకి నీరు ప్రవహిస్తోంది. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నియోజక వర్గాల్లోని 14 మండలాల్లోని 203 గ్రామాలకు 320 చెరువులు, కుంటలకు ప్రతిఏటా వానాకాలం, యాసంగి సీజనలకు నీటిని అందిస్తున్నారు. శ్రీరాంసాగర్ కాల్వలు అస్తవ్యస్తంగా చెట్ల పొదలతో మట్టి పూడిపోయి అధ్వానంగా మారాయి. 30 శాతం నీరు వృథాగా పోతుంది. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల, నూతనకల్, మోతె, పెనపహాడ్, ఆత్మకూరు(ఎస్), నడిగూడెం, గరిడేపల్లి మండలాల్లోని చివరి భూములకు నేటికీ నీరు అందిన దాఖలాలు లేవు. రైతులు ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా, ఆందోళనలు చేసినా పట్టించుకునే
నాథుడే కరువయ్యారని రైతులు వాపోతున్నారు. జాజిరెడ్డిగూడెం మండలంలో రామన్నగూడెం గ్రామసమీపంలోని ఉపకాల్వకు తూతూమంత్రంగా ఉపాధిహామీ పథకం కింద రూ.6లక్షలతో చెట్లను మాత్రం తొలగించారు. కాల్వ పటిష్ఠతను పట్టించుకోవడంలేదు. అర్వపల్లి, కుంచమర్తి, తిమ్మాపురం గ్రామాల సమీపంలో ఉపకాల్వలు పిచ్చిమొక్కలు మొలిచి దర్శనమిస్తున్నాయి. పెద్దచెట్లు, పిచ్చిమొక్కలను తొలగించి కాల్వల మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
70 కిలోమీటర్ల పొడవున 71 డీబీఎం మొయిన కాల్వ
సూర్యాపేట జిల్లాలో 71 డీబీఎం మెయిన కాల్వ 70 కిలోమీటర్ల మేర ఉంది. ఈ కాల్వ కింద 1.44 లక్షల ఎకరాల భూమిని సాగులో తెచ్చేలా కాల్వలు తవ్వారు. ఈ కాల్వ కింద జాజిరెడ్డిగూడెం మండలంలో 10-ఎల్, 12-ఎల్, 18-ఎల్, 19-ఎల్, 11-ఆర్, 13-ఆర్, 14-ఎల్, 15-ఎల్, 16-ఆర్, 1-ఆర్, నాగారం మండలంలోని 4-ఆర్, 6-ఎల్ ఉపకాల్వలు ఉన్నాయి. ఈ ఉపకాల్వలు చెరువులు, కుంటలు నింపడానికే పరిమితమయ్యాయి.
లస్కర్ల నియామకం ఎప్పుడో
శ్రీరాంసాగర్ కాల్వల గుండా ప్రవ హించే నీటిని రైతులకు సక్రమంగా అందజేయడానికి ప్రభుత్వాలు లస్కర్ల నియామకం చేస్తామని ప్రకటనలు చేస్తున్నారే తప్ప నియమించలేదు. కాల్వలకు కొంతమంది ఇష్టానుసారంగా గండ్లు పెట్టడం, తూములు, షటర్లను చోరీచేస్తున్నారు. 69 డీబీఎంకు 46 మంది లస్కర్లు, 70 డీబీఎంకు 5 మంది, 71 డీబీఎంకు 150మంది లస్కర్లు అవసరం ఉన్నట్లు అధికారులు గుర్తించినా నేటి వరకు నియామకం చేపట్టలేదు. వీటిని కాపాడానికి లస్కర్ల నియామకం ఎంతో అవసరముంది.
అంతంతమాత్రంగా మరమ్మతులు
శ్రీరాంసాగర్ మెయినకాల్వలు 150 కిలోమీటర్ల మేర విస్తరించిఉన్నాయి. 12ఏళ్ల కిందట శ్రీరాంసాగర్ ఆధునికీకరణ కోసం ప్రతిపాదిం చిన రూ.300కోట్ల నిధులు విడుదల కాలేదు. తూతూమంత్రంగా రూ.12 కోట్లతో నాగారం మండలం నుంచి జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం వరకు లైనింగ్ పనులు చేపట్టి వదిలేశారు. 69, 70, 71 డీబీఎం కింద 140 కిలోమీటర్లు సిమెంట్, కాంక్రీట్తో లైనింగ్ చేస్తే 2.44 లక్షల ఎకరాలకు నీరు అందే అవకాశం ఉంది. రూ.2కోట్లతో 45 తూములను మరమ్మ తులు చేసినా నేటికీ పూర్తి కాలేదు.
మరమ్మత్తుల కోసం ప్రతిపాదనలు పంపాం
శ్రీరాంసాగర్ రెండో దశ కాల్వల ఆధునికీకరణ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు కేటాయిస్తే లైనింగ్ పనులు ప్రారంభిస్తాం. కొన్ని చోట్ల ఉపకాల్వలు అనవాళ్లు కోల్పోయిన మాట వాస్తవమే. ఉపాధిహామీ పథకం కింద పనులు చేపట్టాలని నివేదికలు పంపాం.
హరిస్వరూప్, ఏఈ ఎస్సారెస్పీ
పిచ్చి మొక్కలను తొలగించాలి
మెయిన, ఉపకాల్వల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలి. ఏళ్ల తరబడి లైనింగ్ పనులు ప్రారంభిస్తామని చెబుతున్నారు తప్ప పనులు మాత్రం చేయడంలేదు. లష్కర్లను నియమించి నీటి వృథాను అరికట్టాలి.
సతీష్, రైతు ఉయ్యాలవాడ గ్రామం, జాజిరెడ్డిగూడెం మండలం
Updated Date - Jun 06 , 2025 | 12:15 AM