kumaram bheem asifabad- కారోబార్లకు మల్టీపర్పస్ కష్టాలు
ABN, Publish Date - Jul 21 , 2025 | 11:18 PM
గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి పని చేస్తున్న కారోబార్లు గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఏర్పడ్డ మల్టీపర్పస్ విధానంతో తమ ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకున్నారు. పెన్ను, పేపర్ పట్టి గ్రామ పంచాయతీ రికార్డులు రాసి సిబ్బందితో పనులు చేయించే కారోబార్లు నేడు జీవో 51తో పార పట్టుకోవాల్సిన స్థితికి చేరుకున్నారు
- సకాలంలో అందని వేతనాలు
- రికార్డులు రాసిన చేతితో పారిశుధ్య పనులు
- పాత పద్ధతినే కొనసాగించాలని వేడుకోలు
కెరమెరి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి పని చేస్తున్న కారోబార్లు గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఏర్పడ్డ మల్టీపర్పస్ విధానంతో తమ ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకున్నారు. పెన్ను, పేపర్ పట్టి గ్రామ పంచాయతీ రికార్డులు రాసి సిబ్బందితో పనులు చేయించే కారోబార్లు నేడు జీవో 51తో పార పట్టుకోవాల్సిన స్థితికి చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో కారోబార్లు, బిల్ కలెక్టర్ సిబ్బంది కలిసి 59 వేల మంది పని చేస్తున్నారు. వారికి ఇచ్చేది కేవలం రూ.9,500 వేతనం మాత్రమే. ఆ వేతనాలు కూడా ప్రతి నెల రావు మూడు నాలుగు నెలలకోసారి వస్తాయి. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కారోబార్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారోబార్లు గ్రామ పంచాయతీల్లో గత కొన్నేళ్లుగా పని చేస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసి ఉన్నారు. దీంతో పారిశుధ్య పనుల నుంచి మినాహా యించి పంచాయతీ నిర్వహణ బాధ్యతలు అప్పగించే నిర్దేషిత జాబ్ చార్ట్ను కేటాయించాలని ప్రభుత్వాన్ని వేడుంటున్నారు. మల్టీపర్పస్ విధానం నుంచి విముక్తులను పాత పద్ధతిలోనే కొనసాగించాలని కోరుతున్నారు. అలాగే ప్రతి నెల గ్రీన్ చానెల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
చాలీచాలని వేతనాలతో..
నిత్యం ప్రజల మధ్య ఉండే కారోబార్లు చాలీచాలని వేతనాలతో గ్రామాల్లో ప్రజలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందు బాటులో ఉండి గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రజలకు గ్రామ, మండల స్థాయి అధికారులకు వారధిగా ఉంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2019 వరకు 856 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 856 మంది కారోబార్లుగా పని చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో 173 మంది గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 173 మంది కారోబార్లుగా పని చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రామాలకు వచ్చే సరికి సిబ్బంది సమన్వయం చేస్తూ పారిశుధ్య పనులు చేయించడం, వీధి దీపాలు వేయించడం, డ్రైనేజీలతో పాటు శుభ, అశుభ కార్యక్రమాల వల్ల ఇంటి వద్ద పరిశుభ్రంగా ఉంచడం, పన్నులు వసూలు చేయడం, బోర్లు మోటారులు కాలిపోతే మరమ్మతులు చేయించడం, వీధి దీపాలు ఏర్పాటు చేయడం, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల కు అందించడంలోనూ వారి పాత్ర కీలకం. అయితే ప్రభుత్వం మల్టీపర్పస్ విధానంతో అన్ని పనులు వారే చేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగికి లేని నిబంధనలను వారికి వర్తింపజేయడంతో కారోబార్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. సంవత్సరాల తరబడి పని చేస్తూ బతుకీడ్చడం వారికి దుర్భరంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాతీ ఉద్యోగులకు న్యాయం చేయాలని కారోబార్లు కోరుతున్నారు.
జీవో 51ని రద్దు చేయాలి..
- మామిడాల నర్సింహులు, గ్రామ పంచాయతీ జేఏసీ చైర్మన్
ప్రభుత్వం జీవో 51ని రద్దు చేయాలి. అందులో నుంచి కారోబార్లను మినహాయించి పాత పద్ధతిని కొనసాగించాలి. ఎవరు పనులు వారే చేసుకొనేలా వెంటనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి. కారోబార్కు వర్క్ చార్ట్ అందించాలి. సిబ్బందికి ప్రతి నెలా గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
Updated Date - Jul 21 , 2025 | 11:18 PM