కారోబార్లకు మల్టీపర్పస్ కష్టాలు
ABN, Publish Date - Jul 12 , 2025 | 12:48 AM
గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి వస్తున్న కారోబార్లు మల్టీ పర్పస్ విధానంతో ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకున్నారు.
కారోబార్లకు మల్టీపర్పస్ కష్టాలు
జీవో 51తో ఉనికిని కోల్పోతున్న జీపీ సిబ్బంది
సకాలంలో అందని వేతనాలు
రికార్డులు రాసిన చేతితో పారిశుధ్య పనులు
పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్
ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకోలు
శాలిగౌరారం, జూలై 11(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి వస్తున్న కారోబార్లు మల్టీ పర్పస్ విధానంతో ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకున్నారు. పెన్ను పట్టి రికార్డులు రాసి సిబ్బందితో పను లు చేయించే కారోబార్లు నేడు పార పట్టుకోవాల్సిన స్థితికి చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో కారోబార్లు, బిల్ కలెక్టర్లు, సిబ్బంది కలి పి 58 వేల మంది పని చేస్తున్నారు. అయినా వారికి ఇచ్చేది కేవలం రూ. 9,500 మాత్రమే. ఆ వేతనాలు కూడా నెలనెలా రాకపోవడంతో వారు కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభు త్వం కారోబార్లు, బిల్ కలెక్టర్ల బాధలు అర్థం చేసుకొని వారిని మల్టీ పర్పస్ విధానం నుంచి విముక్తులను చేసి పాత పద్ధతినే కొనసాగించాలని కోరుతున్నారు. అలాగే ప్రతీ నెలా గ్రీన ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నిత్యం ప్రజల మధ్యే ఉండే కారోబార్లు చాలీచాలని వేతనాలతో గ్రామాల్లో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శి గ్రామానికి వచ్చే సరికి అన్ని పనులు చేసి పెడుతున్నారు. సిబ్బందితో పారిశుధ్య పనులు చేయించడం, వీధి దీపాలు వేయించడం, డ్రైనేజీలతో పాటు శుభ,అశుభ కార్యక్రమాలైన వాళ్ల ఇంటివద్ద పరిశుభ్రం గా ఉంచడం, పన్నులు వసూళ్లు, బోర్లు మోటార్లు ఖాళీపోతే మరమ్మతులు చేయించడం తదితర పనులు చూసుకుంటారు. అలాగే ప్రభుత్వ సంక్షే మ పథకాలను ప్రజలకు అందించడంలోనూ వారి పాత్ర ఉంటుంది. అయితే ప్రభుత్వ మల్టీ పర్పస్ విధానంతో అన్ని పను లు వారే చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేని నిబంధనను వారికి వర్తింపజేయడంలో కారోబార్ల పరిస్థితి అగమ్యగోచరం గా తయారైంది. ఏళ్ల తరబడి పనిచేస్తూ బతుకీడ్చడం వారికి దుర్భరంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ ఉద్యోగులకు న్యాయం చేయాలని కారోబార్లు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 569 మంది
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 71 మండలాల్లో 1780 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో కారోబార్లు 351 మంది, 210 మంది బిల్ కలెక్టర్లు, 1 జూనియర్ అసిస్టెంట్,ఏడుగురు క్లర్క్లు పని చేస్తున్నారు. అయితే 2020లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ల్లో పనిచేస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్ల వివరాలను పంచాయతీ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయ గా వాటిని ఆనలైనలో పొందుపరిచింది. వీరిని పంచాయతీ అసిస్టెంట్లుగా నియమించాలని జీవో 51 నుంచి మినహాయింపు ఇవ్వాలని సిబ్బంది కోరుతున్నారు.
జీవో 51ని సవరించాలి
జీవో 51ని సవరించి అం దులో నుంచి కారోబారు, బిల్ కలెక్టర్లను మినహాయిం చి పాత పద్ధతినే కొనసాగించాలి. ఎవరి పనులు వారే చేసుకునేలా ప్రభుత్వం ఆదేశాలివ్వాలి. కారోబార్ల ఉనికి కోల్పోకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రతీ కారోబార్కు వర్క్చార్ట్ అందించాలి. పంచాయతీల్లో ఇప్పటి వరకు పని చేస్తున్న సిబ్బంది మొత్తాన్ని ఆనలైన చేయాలి. అప్పుడే పంచాయతీలపై ఆర్థికభారం పడకుండా ఉంటుంది. ఏ ప్రభుత్వ శాఖలో లేని నిబంధనను పంచాయతీల్లో అమలుచేయడం సబబు కాదు. గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న అన్ని కేటగిరీల సిబ్బందికి ప్రతీనెలా గ్రీనఛానల్ ద్వారా వేతనాలను వారి ఖాతాల్లో జమ చేయాలి.
గంగారాం, రాష్ట్ర కార్యదర్శి, గ్రామ పంచాయతీ జేఏసీ
పూట గడవడం కష్టంగా ఉంది
ఏళ్ల తరబడి పనిచేస్తున్నా వచ్చే వేతనంతో పూట గడవ టం కష్టంగా మారింది. వచ్చే వేతనం కూడా సకాలంలో రావ డం లేదు. తెల్లవారింది మొదలు రాత్రి వరకు గ్రామాల్లో వెట్టి చాకిరీ చేయాల్సిందే. అయినా గుర్తింపు లేదు. ప్రతీ ఒక్కరూ మమ్మల్ని బెదిరిస్తుంటారు. కొత్త సర్పంచులు వచ్చినప్పుడల్లా ఎవరిని తీసివేస్తారోనని భయం. ఉద్యోగ భద్రత లేదు. సిబ్బందిని తీసివేయకుండా ప్రభుత్వ డీపీవోల ద్వారా ఉత్తర్వులు ఇప్పించాలి. మల్టీపర్పస్ నుంచి మినహాయింపు ఇచ్చి మా పని మేమే చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలి. వేతనాలు నెలనెలా మా ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రతీ ఒక్కరికి గుర్తింపు కార్డులు అందించాలి.
- ఎన. యజ్ఞనారాయణ్, కారోబార్, బిల్ కలెక్టర్ల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
Updated Date - Jul 12 , 2025 | 12:48 AM