సమాజంలో వైద్య వృత్తి పవిత్రమైనది : కలెక్టర్
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:01 AM
వైద్య వృత్తి సమాజంలో పవిత్రమైన, కీలకమైనదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆపద సమయంలో ప్రజలందరికీ ఆపద్బాంధవుడిలా కనిపించే వైద్యులను ప్రజలు ఎంతగానో గౌరవిస్తారని అన్నారు.
నల్లగొండ టౌన్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): వైద్య వృత్తి సమాజంలో పవిత్రమైన, కీలకమైనదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆపద సమయంలో ప్రజలందరికీ ఆపద్బాంధవుడిలా కనిపించే వైద్యులను ప్రజలు ఎంతగానో గౌరవిస్తారని అన్నారు. మంగళవారం జాతీయ వైద్యు ల దినాన్ని పురస్కరించుకొని ఉత్తమ సేవలందించిన వైద్యులను తన క్యాంపు కార్యాలయం లో శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడే వారిని ప్రమాదస్థితి నుంచి కాపాడే శక్తి కేవలం వైద్యుడికే ఉందన్నారు. మానవతా దృక్పథంతో చేసే పవిత్రమైన వృత్తిలో వైద్యులుగా ఉండడం అదృష్టమన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్ఎ్స డాక్టర్ మాతృనాయక్, డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, తదితరులు ఉన్నారు.
వర్షంలో కూర్చోబెట్టడం ఏంటి?
(ఆంధ్రజ్యోతి, తిరుమలగిరి(సాగర్)): విద్యార్థినుల వర్షంలో కూర్చోబెట్టడం ఏంటని కేజీబీవీ ఉపాధ్యాయులపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్ర హం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీని అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్తో కలిసి తనిఖీచేశారు. చినుకు లు కురుస్తుండగా, చెట్ల కిందనే విద్యార్థినులను కూర్చోబెట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. నూతనంగా నిర్మించిన కేజీబీవీ భవనం ప్రారంభించినా అందులోకి ఎందుకు మారలేదని ఎస్ వో కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన భవనంలో కొన్ని పనులు ఉండటంతో మారలేదని ఎస్వో వివరించారు. అనంతరం విద్యార్థినులతో వైజాగ్ స్పెల్లింగ్ రాయాలని చెప్పగా ఎవ్వరూ సరిగా రాయకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఎంఈవో శ్రీనివాస్, ఎస్వో, బోధనా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నూతన కేజీబీవీ భవనాన్ని పరిశీలించారు. మిగిలి ఉన్న పనులను సత్వరమే పూర్తి చేసి పాఠశాలను దీనిలోకి మార్చాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలానికి నూతనంగా మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి ప్రతిపాదించిన రంగుండ్ల రోడ్డులోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఆమె వెంట అనుముల తహసీల్దార్ రఘు, ఆర్ఐ లక్ష్మీకాంత్, ఎంపీవో భిక్షంరాజు, తదితరులు ఉన్నారు.
నెల్లికల్ లిఫ్టు పనులు వేగవంతం చేయాలి
వర్షాకాలం దృష్ట్యా నెల్లికల్ లిఫ్ట్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సాగర్ జలాశయ తీరంలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పంప్హౌస్ పనులను మంగళవారం తనిఖీ చేశారు. వర్షాల వల్ల సాగర్ జలాశయం నిండితే పనులకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, లిఫ్ట్ ఏజెన్సీ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎత్తిపోతల పథకంతో మండలంలోని 11గ్రామాల్లో 24,624 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని అదికారులు కలెక్టర్కు తెలిపారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ శాఖ డీఈఈ సీతారాం, పెద్దవూర తహసీల్దార్ శ్రీనివాస్, ఏఈ రవి ఉన్నారు.
Updated Date - Jul 02 , 2025 | 12:01 AM