ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలి
ABN, Publish Date - Apr 26 , 2025 | 11:07 PM
జిల్లాలో గుర్తించిన ప్రాంతాల్లో టీజీఎండీసీ ద్వారా నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
- కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేటటౌన్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గుర్తించిన ప్రాంతాల్లో టీజీఎండీసీ ద్వారా నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని వీసీ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన డిస్ర్టిక్ లెవల్ స్టాండింగ్ కమిటీ(డీఎల్ఎస్సీ) సమావేశం ఏర్పాటు చేశారు. మాగనూరు మండలం అడవిసత్యారంకు చెందిన నలుగురు రైతులు, వర్కూరుకు చెందిన మరో రైతు తమ పట్టా భూముల నుంచి ఇసుకను తొలగించాలని దరఖాస్తు చేసుకోగా సమావేశంలో ఆ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఇసుక తరలింపు విషయంలో మైనింగ్, రెవెన్యూ, భూగర్భ జలశాఖ, సర్వే ల్యాండ్, నీటి పారుదల, వ్యవసాయ శాఖల అధికారుల నివేదికలు, అభిప్రాయాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారుల రిపోర్టుల ఆధారంగా అనుమతికి కలెక్టర్ అంగీకారం తెలిపారు. ఇసుక తరలించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ, పంచాయతీ కార్య దర్శులతో కలిపి ఒక టాస్క్ఫోర్టు కమిటీని ఏర్పాటు చేసి ఇసుక తరలింపుపై పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ రీచ్ల నుంచి రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా జరగకుండా నిఘా పెట్టాలని మాగనూరు ఎస్ఐని ఆదేశించారు. రెవెన్యూ అధికారితో కలిసి ఇసుక రీచ్లను పరిశీలించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలం, ఆర్డీవో రాంచందర్ నాయక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, జిల్లా పంచాయతీ అఽధికారి రంగారెడ్డి, నీటిపారుదల శాఖ జిల్లా అధికారి, జిల్లాకు చెందిన తహసీల్దార్లు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
Updated Date - Apr 26 , 2025 | 11:07 PM