రోహిణిలో ఊటీలా..
ABN, Publish Date - May 26 , 2025 | 11:38 PM
వేసవి వచ్చిందంటే ఎండ వేడిమికి మాడు పగులుతుంది. అందులోనూ రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయంటారు. కానీ ప్రస్తుతం వాతావరణం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.
రోళ్లు పగిలే కాలంలో వణుకుతున్న జనం
జిల్లాలో నాలుగు రోజులుగా వానలు
సోమవారం రోజంతా ముసురు
మహబూబ్నగర్, మే 26(ఆంధ్రజ్యోతి): వేసవి వచ్చిందంటే ఎండ వేడిమికి మాడు పగులుతుంది. అందులోనూ రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయంటారు. కానీ ప్రస్తుతం వాతావరణం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. రోహిణి కార్తె ప్రారంభమై రెండ్రోజులు అవుతోంది. ఈ సమయంలో భగభగ మండే ఎండలతో చెమటలు ధారలా కారాల్సి ఉండగా, చలికి ప్రజలు వణుకుతున్నారు. కూలర్లు, ఏసీలు వేసుకున్నా ఉక్కపోత నుంచి ఉపశమనం లభించని ఈ కాలంలో వాటిని వినియోగించడం లేదు. రాత్రి అయితే చలికి దుప్పటి కప్పుకుని పడుకోవాల్సి వస్తోంది. పాలమూరు జిల్లాలో మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వానలకు వాతావరణం పూర్తిగా చల్లబడింది. సోమవారం రోజంతా ముసురు వాన పడటంతో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. మండు వేసవిలో వాతావరణం చల్లగా మారడంతో.. వేసవిలో ఊటిలా మారిందని చర్చించుకుంటున్నారు. చలితో టీ కొట్లు, మిర్చి బండ్లకు గిరాకీ పెరుగుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వానలతో పాటు ఒకటి రెండు రోజుల్లో నైరుతీ రుతు పవనాలు కూడా రానుండటంతో జిల్లాలో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఎండాకాలం ఇక ముగిసినట్లేనని ప్రజలు భావిస్తున్నారు.
Updated Date - May 26 , 2025 | 11:38 PM