భూబాధితులకు న్యాయం చేయాలి
ABN, Publish Date - Mar 18 , 2025 | 11:00 PM
నారాయణపేట-కొడంగల్ ఎత్తి పోతల ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ఏఐకేఎస్ జాతీయ నాయకుడు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
- మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నారాయణపేటటౌన్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట-కొడంగల్ ఎత్తి పోతల ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ఏఐకేఎస్ జాతీయ నాయకుడు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్స్లో మంగళవారం భూసంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పోలీసులను పెట్టి భూసేకరణ చేయడం సరైంది కాదన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, సొంత జిల్లా వాసి అయినందున రైతులు మాకు న్యాయం జరుగుతుందని ఆశగా ఉన్నారని, ప్రభుత్వం రైతుల కడుపు కొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్ర భుత్వం వెంటనే రైతులతో చర్చించి భూమికి బదులు భూమి ఇవ్వాలని లేకపోతే 2013 చట్టం ప్రకారం బహిరంగ మార్కెట్ ధరకు మూడింతలు కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు ఇస్తోందన్నారు. భూములు కోల్పోతున్న రైతాంగానికి ఎర్రజెండా అండగా ఉంటుందన్నారు. మాజీ వైస్ ఎంపీపీ మహేష్కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య, మచ్చందర్, రాజు, కేశవ్గౌడ్, నారాయణ, సాయికుమార్ ఉన్నారు.
Updated Date - Mar 18 , 2025 | 11:00 PM