నీతి అయోగ్ డెల్టా ర్యాంకింగ్లో గట్టుకు 5వ స్థానం
ABN, Publish Date - Jun 27 , 2025 | 11:14 PM
నీతి అయోగ్ తాజాగా విడుదల చేసిన ఆస్పిరేషనల్ బ్లాక్ పోగ్రామ్ 2024- 25 (జనవరి- మార్చి 2025) క్యూ4 డెల్టా ర్యాంకింగ్లో గట్టు బ్లాక్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
- గట్టు బ్లాక్కు త్వరలో రూ. కోటి రూపాయల పురస్కారం
-కలెక్టర్ బీఎం సంతోష్ వెల్లడి
గట్టు, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): నీతి అయోగ్ తాజాగా విడుదల చేసిన ఆస్పిరేషనల్ బ్లాక్ పోగ్రామ్ 2024- 25 (జనవరి- మార్చి 2025) క్యూ4 డెల్టా ర్యాంకింగ్లో గట్టు బ్లాక్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. నీతి అయోగ్ విడుదల చేసిన డెల్టా ర్యాంకింగ్లో 5వ స్థానం లభించిందని జోగుళాంబ గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ శుక్రవారం పత్రికా ప్రకటనలో తెలియజేశారు. దేశవ్యాప్తంగా 500 బ్లాక్లలో 5వ స్థానంతో పాటు, జోన్- 3లో 2వ స్థానం సాధించిందని వెల్లడించారు. ఈ ప్రగతికి గుర్తింపుగా త్వరలో నీతి అయోగ్ తరపున గట్టు బ్లాక్కు కోటి రూపాయల పురస్కారం అందచేయబడుతుందని తెలిపారు. ఈ ర్యాంకింగ్ నీతి ఆయోగ్ నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 500 ఆస్పిరేషనల్ బ్లాక్లు పాల్గొన్న సందర్బంలో నీతి అయోగ్ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన వాల్ ఆఫ్ ఫేమ్లో టాప్ ర్యాంక్ సాధించిన బ్లాక్ల విజయ గాథలు ప్రదర్సించ బడుతాయన్నారు. ఆస్పిరేషనల్ బ్లాక్తో పాటు డిస్ర్టిక్ట్ పోగ్రామ్లు దేశాన్ని వికసిత భారత్ 2047 లక్ష్యం వైపు నడిపించేందుకు ఎలా పని చేస్తాయో చూపిస్తుందన్నారు. ఈ ర్యాంకింగ్ 5 ప్రధాన అంశాలకు ఉన్న 39 కీలక పనితీరు సూచికలు ఆధారంగా నిర్ణయించారన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి వంటి అంశాలను తీసుకున్నారని చెప్పారు. గట్టు బ్లాక్ యోక్క కంపోజిట్ స్కోర్ 61.24 నుంచి 69.43కు పెరిగి 8.19 శాతం అభివృద్ధిని నమోదు చేసిందన్నారు. ఈ ఘనతకు అందరి సమిష్టి కృషి ఫలితంగా సాధ్యమైందని కలెక్టర్ అభినందించారు.
Updated Date - Jun 27 , 2025 | 11:14 PM