ఈ ప్రాంత అభివృద్ధికి కృషి
ABN, Publish Date - Jun 24 , 2025 | 11:27 PM
ఈ ప్రాంత ప్రజలు తనను ఎంపీగా గెలిపించి ఏడాది పూర్తయ్యిందని, ఈ ఏడాది పాలన ఎంతగానో సంతృప్తిని ఇచ్చిందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని చెప్పారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టి, ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం ఆమె తన స్వగృహంలో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఏడాది పాలన సంతృప్తిని ఇచ్చింది
ఎంపీ డీకే అరుణ
మహబూబ్నగర్ కలెక్టరేట్, జూన్ 24(ఆంధ్రజ్యోతి): ఈ ప్రాంత ప్రజలు తనను ఎంపీగా గెలిపించి ఏడాది పూర్తయ్యిందని, ఈ ఏడాది పాలన ఎంతగానో సంతృప్తిని ఇచ్చిందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని చెప్పారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టి, ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం ఆమె తన స్వగృహంలో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను నమ్మి గెలిపించిన ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతం అయినట్లు చెప్పారు. పాలమూరులో అన్ని రంగాలు అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు రూ.562 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఇవేకాకుండా మరెన్నో నిధులు తెచ్చామన్నారు. జడ్చర్ల నుంచి రాయిచూర్ రోడ్డు 4 లేన్లుగా చేయడానికి కేంద్ర అంగీకారం తెలిపిందన్నారు. ఎన్హెచ్-44 6 లేన్లుగా అప్గ్రేడ్ చేశామన్నారు. నారాయణపేట మీదుగా కర్ణాటక వరకు వెళ్లే ఎన్హెచ్-167 రోడ్డు 4 లేన్లుగా అభివృద్ధి చేయనున్నామన్నారు. పాలమూరు మీదుగా వెళ్లే 167 రహదారికి అనుసంధానంగా బైపాస్ రోడ్డుకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. జిల్లా అభివృద్ధి కోసం నిధులకు ఆయా కేంద్ర మంత్రులను కలిసి, తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నానని వివరించారు. అంతకు ముందు ఏడాదిలో ఎంపీగా సాధించిన విజయాలు, తీసుకొచ్చి ఖర్చు చేసిన నిధులు, చేసిన అభివృద్ధి పనులపై వికసిత్ భారత్లో పాలమూరు నియోజకవర్గం పేరుతో రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అరుణను సన్మానించారు.
Updated Date - Jun 24 , 2025 | 11:27 PM