బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలి
ABN, Publish Date - Jun 04 , 2025 | 10:54 PM
మండలంలోని చిన్నజట్రం గ్రామంలో గతనెల 31వ తేదీన ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో నర్సిములు అనే వ్యక్తి మృతిచెందగా, భాస్కర్కు తీవ్ర గాయాలయ్యాయి.
- చిన్నజట్రంలో అంతర్రాష్ట్ర రహదారిపై కుటుంబీకులు, గ్రామస్థుల రాస్తారోకో
- గంటపాటు నిలిచిపోయిన వాహనాలు
నారాయణపేట రూరల్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నజట్రం గ్రామంలో గతనెల 31వ తేదీన ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో నర్సిములు అనే వ్యక్తి మృతిచెందగా, భాస్కర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం కుటుంబీకులు, బంధువులు, గ్రామస్థులు గంటపాటు చిన్నజట్రం అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కుటుంబ యజమాని చనిపోవడంతో కుటుంబం దిక్కు లేకుండా పోయిందన్నారు. మృతుడికి భార్యతో పాటు, ఒక కూతురు ఉన్నారని వారికి సహాయం చేయడంలో ఆలస్యం చేస్తున్నారన్నారు. వెంటనే బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గంటపాటు రాస్తారోకో నిర్వహించడంతో పేట-హైదరాబాద్ తదితర గ్రామాలకు వెళ్లే వాహనాలు పెద్దఎత్తున రోడ్డుపై నిలిచిపోయాయి. ఏఎస్ఐ బాలయ్య, హెడ్ కానిస్టేబుల్ కుర్మయ్య, కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్ఐ రాముడు ఫోన్లో బస్సు యజమానిని రప్పించి మాట్లాడుతామని కుటుంబీకులకు, బంధువులకు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
Updated Date - Jun 04 , 2025 | 10:54 PM