రైల్వేగేటు మూతతో వ్యాపారాలు వెలవెల
ABN, Publish Date - May 27 , 2025 | 11:06 PM
మండల కేంద్రంలోని రైల్వే గేటును మూసివేయడంతో వ్యాపారాలు వెలవెల బోతున్నాయి.
బస్టాండ్లోకి రాని ఆర్టిసీ బస్సులు
దేవరకద్ర, 27 మే (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని రైల్వే గేటును మూసివేయడంతో వ్యాపారాలు వెలవెల బోతున్నాయి. ఇప్పటికే కొందరు దుకాణాలు మూసివేయగా, మరి కొందరు ఖాళీ చేయకుండా ఎదురుచూస్తున్నారు. జన సంచారం లేకపోవడం, వ్యాపారాలు నడవక షాపుల కిరాయి కూడా కట్టని పరిస్థితి నెలకొందని దుకాణ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్త బస్టాండ్ వద్ద కూడా ప్రజల సందడి తగ్గింది. చాలా బస్సులు బస్టాండ్లోకి రాకుండానే ఫ్లైఓవర్ మీదుగా నేరుగా వెళ్తున్నాయి. దీంతో హైదరాబాద్, రాయచూరు, మహబూబ్నగర్ వెళ్లే ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్వోబీ వద్ద సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయకపోవడం, సూచికలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక వేళ బస్టాండ్లోకి బస్సులు వచ్చినా కూడా ఆర్వోబీ నిర్మాణం ఇరుకుగా ఉన్న కారణంగా యూటర్న్ తీసుకోవడానికి వీలులేని పరిస్థితి నెలకొనడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అండర్పాస్ బిడ్ర్జిని ఏర్పాటు చేయాలని వ్యాపారులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Updated Date - May 27 , 2025 | 11:06 PM