సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చేయాలి
ABN, Publish Date - May 26 , 2025 | 11:11 PM
ఈ సారి వర్షాకాలం ముందుగానే వచ్చేసిందని, ప్రతీ సంవంత్సరం మాదిరిగానే సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులకు సూచనలు చేశారు.
- ప్రతీ శుక్రవారం డ్రై డే నిర్వహించాలి
- కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్నగర్ కలెక్టరేట్, మే 26 (ఆంధ్రజ్యోతి) : ఈ సారి వర్షాకాలం ముందుగానే వచ్చేసిందని, ప్రతీ సంవంత్సరం మాదిరిగానే సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులకు సూచనలు చేశారు. ఈ సీజన్ మొత్తం శానిటేషన్పై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రొటోకాల్ ప్రకారం జిల్లా అధికారులందరు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వచ్చే ఐదు రోజుల పాటు విస్తృతంగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని పంచాయతీ, మునిసిపాలిటీ అధికారులను ఆదేశించారు. పట్టణాలు, గ్రామాల్లో రోడ్ల వెంట, ముఖ్యంగా ఓపెన్ ప్లాట్లల్లో చెత్తను తొలగించాలని సూచించారు. అదే విధంగా మురుగు నీటి కాల్వలను శభ్రం చేయాలని, తాగునీటి వనరులు క్లోరినేషన్ చేయాలని, తాగునీటి సరఫరా పైపులైన్ లీకేజీలను అరికట్టాలని మిషన్భగీరథ, పంచాయతీ అధికారులను ఆదేశించారు. ప్రతీ శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని, విద్యుత్ పోల్స్, విద్యుత్ సరఫరా తీగలకు చెట్లు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాజీవ్ యువ వికాసం కింద ఆయా మండలాల్లో పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి, బ్యాంకర్ల ఆమోదంతో తక్షణమే జాబితాను పంపించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ను వేగవంతం చేయాలని, వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీఆర్డీవో నర్సింహులు, డీసీవో శంకరాచారి పాల్గొన్నారు.
ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
ప్రజల నుంచి స్వీకరిస్తున్న ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, ఏడీ, సర్వే ల్యాండ్, డీఎం సివిల్ సప్లయ్, డీపీవో, ఎక్సైజ్ శాఖ, ఎల్డీఎం, హౌసింగ్ తదితర శాఖలకు సంబంధించి 116 ఫిర్యాదులు అందినట్లు వివరించారు. అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, ఎస్.మోహన్రావు. జడ్పీ సీఈవో వెంకట్రెడ్డి, ఆర్డీవో నవీన్, మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, అర్బన్ తహసీల్దార్ ఘాన్సీరామ్ పాల్గొన్నారు.
Updated Date - May 26 , 2025 | 11:11 PM