‘యుక్తధార’’ వచ్చేసింది..
ABN, Publish Date - May 24 , 2025 | 12:37 AM
గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పకడ్బందీగా నిర్వహించే దిశగా కేంద్రం మూడు సంవత్సరాలుగా చర్యలు చేపట్టింది.
- జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్లో 12 గ్రామాలు
- యాప్లోనే పనుల గుర్తింపు
- కేంద్ర కనుసన్నల్లో ఉపాధిహామీ
- జూన్ 18 వరకు సిబ్బందికి శిక్షణ
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పకడ్బందీగా నిర్వహించే దిశగా కేంద్రం మూడు సంవత్సరాలుగా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ, అందుకు సంబంధించిన లేబర్ బడ్జెట్ రూపొందించి పనులు అమలుచేస్తున్నా అనేక అక్రమాలు వెలుగుచూస్తున్న తీరును అరికట్టే దిశగా ఇప్పటికే 2022లో దేశమంతా ఒకే విధానం ఉండే విధంగా సాప్ట్వేర్ల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించే టీటీఏ సాప్ట్వేర్ను తొలగించి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సర్వర్ను అందుబాటులోకి తీసుకవచ్చింది. గతంలో ఉపాధి పనులు ఇష్టానుసారంగా జరిగిన క్రమంలో పాత విధానాలకు స్వస్తి పలికి, కొత్త విధానాలను అమల్లోకి తెస్తూ పూర్తిగా ఉపాధిహామీ పనులు కేంద్ర కనుసన్నల్లోనే కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఉండకుండా కేంద్ర ప్రభుత్వం అంతా తానై పథకం నడిపే విధంగా పనుల గుర్తింపునకు సంబంధించి యుక్తధార యాప్ను అందుబాటులోకి తెచ్చింది. యుక్తధార పోర్టల్ ద్వారా ఉపాధిహామీ పనులను చేపట్టనున్నారు. ఇందుకోసం పైలట్ ప్రాజెక్ట్ కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 12 మండలాల్లో 12 గ్రామపంచాయతీలను ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్ట్కు సంబంధించి జిల్లాలోని ఉపాధిహామీ సిబ్బందికి హైదరాబాద్లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. జూన్ 18 వరకు శిక్షణ అందించనున్నారు. జిల్లాలోని గ్రామాల్లో జరుగుతున్న పనులకు సంబంధించి తొలిదశలో యుక్తధార యాప్ జియోస్పేషియల్ ప్లానింగ్ పోర్టల్కు అనుగుణంగా పనిచేస్తుంది. ఉపాధి పనులను గుర్తించిన అనంతరం వాటిని జియో ట్యాగింగ్ ద్వారా యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా పనులకు వచ్చే కూలీల వివరాలను కూడా పొందుపర్చనున్నారు. ఎలాంటి అవకతవకలకు వీలు లేకుండా, అక్రమాలు జరగకుండా యుక్తధార యాప్ ద్వారా పారదర్శకంగా పనులు చేపట్టనున్నారు.
ఫ 12 గ్రామాలు ఎంపిక..
కేంద్ర ప్రభుత్వం తన కంట్రోల్లో ఉపాధిహామీ పథకం పనులు నడిచే విధంగా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా యుక్తధార పైలట్ ప్రాజెక్ట్లో తొలివిడతగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 గ్రామాలను ఎంపిక చేసింది. జిల్లాలోని బోయినపల్లి మండలం విలాసాగర్, చందుర్తి మండలం మల్యాల, రుద్రంగి మండలంలో రుద్రంగి, ఇల్లంతకుంట మండలంలో అనంతారం, గంభీరావుపేట మండలం ముచ్చర్ల, తంగళ్లపల్లి మండలంలో అంకిరెడ్డిపల్లె, ముస్తాబాద్ మండలంలో నామాపూర్, వేములవాడ అర్బన్ మండలంలో మారుపాక, వేములవాడ రూరల్ మండలంలో నూకలమర్రి, కోనరావుపేట మండలంలో వట్టిమల్ల, వీర్నపల్లి మండలంలో మద్దికుంట తండాలను ఎంపిక చేసి యుక్తధార పోర్టల్ ద్వారా ఉపాధిహామీ పనులు నడిపిస్తున్నారు.
ఫ జిల్లాలో 1.99 లక్షల మంది ఉపాధి కూలీలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధిహామీ పథకంలో పనిచేయడానికి జిల్లాలో 1.99 లక్షల మంది కూలీలుగా నమోదయ్యారు. జిల్లాలో 98,047 జాబ్ కార్డులు ఉండగా, లక్షా 99 వేల 950 మంది కూలీలు ఉన్నారు. ఇందులో 1,01,393 మంది మహిళా కూలీలు ఉన్నారు. యాక్టివ్ జాబ్ కార్డులు 60,431 ఉండగా 92589 మంది ఉన్నారు. జిల్లాలో గంభీరావుపేటలో 27,062 మంది కూలీలు ఉండగా, కోనరావుపేటలో 23,687 మంది, బోయినపల్లిలో 15,059 మంది, చందుర్తిలో 16,869 మంది, ఇల్లంతకుంటలో 20,521 మంది, ముస్తాబాద్లో 18,372 మంది, వేములవాడలో 7,138 మంది, ఎల్లారెడ్డిపేటలో 27,716 మంది, రుద్రంగిలో 6,186 మంది, తంగళ్లపల్లిలో 17,078 మంది, వీర్నపల్లిలో 9,804 మంది, వేములవాడ రూరల్లో 10,458 మంది కూలీలు ఉన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ కూలీలకు కూలీ రూ.307 నిర్ణయించారు. ఉపాధిహామీ పనులు మరింత పకడ్బందీగా నిర్వహించడానికి నిరంతరం నిఘా పర్యవేక్షణ కోసం విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలో 260 గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన కమిటీల్లో ఐదుగురు సభ్యులతో వీఎంసీ కమిటీ పనిచేయనుంది. ఇందులో మండల ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, మహిళ సంఘం, స్వచ్ఛంద సంస్థ, ఉపాధిహామీల కూలీల నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, స్వశక్తి సంఘాల మహిళలు ఉంటారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారిని కూడా భాగస్వాములు చేస్తారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే పూర్తిగా ఉపాధిహామీ పనిచేయనుంది.
Updated Date - May 24 , 2025 | 12:37 AM