సమన్వయంతో సేవలందించాలి
ABN, Publish Date - Jun 17 , 2025 | 11:45 PM
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖలోని వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ మహిళలు, శిశువులకు సేవలందించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ అన్నారు.
కరీంనగర్ టౌన్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖలోని వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ మహిళలు, శిశువులకు సేవలందించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ అన్నారు. కరీంనగర్లోని బాలసదనం, శిశుగృహ, శక్తి సదన్ సఖి కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. శిశుగృహ, బాలసదనంలో ఆశ్రయం పొందుతన్న చిన్నారుల వివరాలు, దత్తత వివరాలను తెలుసుకున్నారు. సఖి కేంద్రంలో బాధిత మహిళలకు ఉచిత న్యాయ, వైద్యం, ఆశ్రయంతోపాటు పోలీసు సేవలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మహిళలు, శిశువులకు సంబంధించి ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న ప్రతి పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని అన్నారు. అంగన్వాడీలో పిల్లల హాజరుశాతం పెంచాలని సూచించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీసీపీవో సర్వీన్, సీడీపీవోలు సబిత, నర్సింగారాణి, శ్రీమతి, సఖి అడ్మిన్ లక్ష్మి, మహిళా సాధికారత కేంద్రం కో-ఆర్డినేటర్ శ్రీలత పాల్గొన్నారు.
ఫ అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య
తిమ్మాపూర్: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించామని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ తెలిపారు. మండలంలోని ఎల్ఎండీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఝాన్సీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీల్లో విద్యార్థుకు పోషకాహారం, ఆటపాటలతో విద్యను అందిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను ఆకర్షణీయవంతంగా మలిచామని, కొత్త సిలబస్ రూపొందించామన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, మండల విద్యాధికారి శ్రీనివాస్, సీడీపీవో శ్రీమతి పాల్గొన్నారు.
Updated Date - Jun 17 , 2025 | 11:45 PM