వయోజన విద్యకు ‘ఉల్లాస్’
ABN, Publish Date - Jun 07 , 2025 | 01:14 AM
మహిళా సంఘాల్లో ఉన్న నిరక్షరాస్యులైన వయోజన మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ అన్ ఇన్ సొసైటీ) పథకాన్ని అమలులోకి తెచ్చింది. దేశంలో ఉన్న ప్రతీ మహిళా అక్షర జ్ఞానం కలిగి ఉండాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ పథకాన్ని విద్యాశాఖ, సెర్ప్ ఉమ్మడి బాగస్వామ్యంతో ఈపథకాన్ని కొనసాగించనున్నారు.
- చదువు రాని మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కార్యక్రమం
- నిరక్షరాస్యులను గుర్తించే పనిలో డీఆర్డీఏ సిబ్బంది
- విద్యాశాఖ, సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ
- జిల్లాలో 14,694 మహిళా సంఘాలు... 1,73,412 మంది సభ్యులు
జగిత్యాల, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల్లో ఉన్న నిరక్షరాస్యులైన వయోజన మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ అన్ ఇన్ సొసైటీ) పథకాన్ని అమలులోకి తెచ్చింది. దేశంలో ఉన్న ప్రతీ మహిళా అక్షర జ్ఞానం కలిగి ఉండాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ పథకాన్ని విద్యాశాఖ, సెర్ప్ ఉమ్మడి బాగస్వామ్యంతో ఈపథకాన్ని కొనసాగించనున్నారు. దశల వారీగా అమలు చేసే ఉల్లాస్ పథకంలో ముందుగా మహిళా సంఘాల్లో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరస్యులుగా చేయడంతో పాటు రెండో దశలో మధ్యలో బడి మానేసిన వారిని గుర్తించి ఓపెన్ స్కూల్ ద్వారా నేరుగా పదో తరగతితో పాటు వారి ఆసక్తిని బట్టి ఓపెన్ డిగ్రీ వరకు చదివించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
- ఉల్లాస్ లక్ష్యం...
సామాజిక సాధికారతలో భాగంగా ఉల్లాస్ కార్యక్రమం ద్వారా చదువురాని వారందరికీ చదవడం, రాయడం నేర్పించడమే ఉల్లాస్ పథకం ప్రధాన లక్ష్యం. మహిళా సంఘాల్లో ఉన్న సభ్యుల్లో కేవలం 50 శాతం మందికి మాత్రమే సంతకం చేయడం వచ్చని, మిగిలిన సగం శాతం మంది వేలి ముద్రలు వేస్తారనేది ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారిక సమాచారం. మహిళలందరికీ చదవడం, రాయడం నేర్పించాలనే ఉల్లాస్ పథకం ఉద్దేశం. వయోజన మహిళలకు చదవడం, రాయడం నేర్పించడమే కాకుండా మధ్యలో బడి మానేసిన వారిని సైతం గుర్తించి వారిని నేరుగా ఓపెన్ టెన్త్, వారికి ఆసక్తి ఉంటే ఓపెన్ డిగ్రీ చదివిస్తారు. ఆ తర్వాత వారికి స్కిల్ డెవలప్మెంట్, టెక్నికల్ కోర్సులు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉల్లాస్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. మహిళలకు చదవడం, రాయడంతో పాటు బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక క్రమశిక్షణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలను సైతం నేర్పిస్తారు.
- మహిళా సంఘాల్లో నిరక్షరాస్యుల గుర్తింపు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఆర్డీఏ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరక్షరాస్యులను గుర్తించే పనిలో ఉన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగే ఈ ఉల్లాస్ పథకం ద్వారా నిరక్షరాస్యులను గుర్తించే కార్యక్రమాన్ని సెర్ప్ అధికారులు ప్రారంభించారు. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ఉన్న మహిళా సంఘాల్లోని సభ్యుల్లో నిరక్షరాస్యుల సంఖ్యను వీవోఏ (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్)ల ద్వారా ఏపీవోలు గుర్తిస్తారు. ఈనెల చివరి నాటికి సంఘాల్లో నిరక్షరాస్యులను, మధ్యలో బడిమానిన వారిని గుర్తించి నివేదిక ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి పథకానికి సంబందించిన విధివిధానాలను సెర్ప్ అధికారులకు, సిబ్బందికి సమగ్రంగా వివరించినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు.
- వలంటీర్లుగా మహిళా సంఘాల అక్షరాస్యులు..
డీఆర్డీవో, సెర్ప్ అఽధ్వర్యంలో నిరక్షరాస్యులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేయగానే నిరక్షరాస్యులతో 15 నుంచి 20 మంది చొప్పున గ్రూపులను ఏర్పాటు చేస్తారు. ఆగ్రామంలో మహిళా సంఘాల్లో అక్షరాస్యలైన వారిని వలంటీర్లుగా ఎంపిక చేసి నిరక్షరాస్యుల గ్రూపులను కేటాయించి వారికి చదువు చెప్పిస్తారు. గ్రూపులో ఉన్న వారందరికి చదవడం, రాయడం వచ్చే వరకు వీరికి చదువు చెప్పే బాధ్యత వలంటీర్లదే. ఎలాంటి పారితోషికం గాని, గౌరవ వేతనంగా గాని లేకుండానే కేవలం సేవా భావంతో ఎంపికైన వలంటీర్లు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ పుస్తకాలు అందించ డంతో పాటు పథకం విజయవంతం అయ్యేందుకు ఆయా గ్రామాల్లోని ఉపాధ్యాయుల ద్వారా సహకారం అందించనున్నారు.
- తల్లి చదువుతో కుటుంబాల్లో వెలుగులు....
తల్లి చదవడం ద్వారా ఆ కుటుంబంలో వెలుగు నిండుతుంది. చదువు విలువ తెలిసి కుటుంబమంతా అక్షరాస్యులు ఉంటే ఆ కుటుంబాల ద్వారా గ్రామం అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో పయనించేందుకు దోహదపడుతుం ది. బడికి వెళ్లే పిల్లల సంఖ్య పెరగడంతోపాటు డ్రాపౌట్ తగ్గితే బాల్య వివాహా లపై అవగాహణ పెరుగుతుంది. అక్షరాస్యులుగా మారడం ద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై అవగాహన పెరిగి ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికి అందుతాయి.
మహిళలకు మంచి అవకాశం
- రఘువరన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
నిరక్షరాస్యులైన మహిళలకు చదవడం, రాయడం నేర్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఉల్లాస్ పథకం చదువురాని వారికి మంచి అవకాశం. జిల్లాలో ఉన్న మహిళా సంఘాల్లో నిరక్షరాస్యుల వివరాలు వయోజన విద్యాశాఖ అధికారులకు అందజేస్తాము. ఉల్లాస్ పథకంలో భాగంగా మహిళా సంఘాల్లో నిరక్షరాస్యులతో పాటు బడి మధ్యలో మానేసిన వారికి, దివ్యాంగులకు సైతం చదవడం, రాయడం నేరిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని నిరక్షరాస్యులైన మహిళలందరు సద్వినియోగం చేసుకొని లక్ష్యాన్ని నెరవేర్చాలి.
Updated Date - Jun 07 , 2025 | 01:15 AM