గెలిచే వారికే టిక్కెట్లు
ABN, Publish Date - Jul 19 , 2025 | 12:26 AM
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అవకాశమున్న నాయకులకు మాత్రమే టిక్కెట్లు వస్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, గెలుపు కార్యాచరణపై ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
భగత్నగర్, జూలై 18(ఆంధ్రజ్యోతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అవకాశమున్న నాయకులకు మాత్రమే టిక్కెట్లు వస్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, గెలుపు కార్యాచరణపై ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న నేతలకు టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా వారిని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీలో ఏ గ్రూపు లేదని, ఉన్నదల్లా మోదీ గ్రూప్ మాత్రమేనని అదే బీజేపీ గ్రూప్ అని స్పష్టం చేశారు. తనకు గ్రూపులు ఆపాదించొద్దని, ఎవరైనా బండి సంజయ్ గ్రూప్ అని, మరో గ్రూపు వాళ్లమని ప్రచారం చేసుకుంటే వారికి టిక్కెట్లు కూడా రావని హెచ్చరించారు. వ్యక్తి కోసం పనిచేస్తే ప్రోత్సహించే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. గ్రామ పంచాయతీలకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో, 19 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రత్యేకించి జరిగిన అభివ్రుద్ధి ఏమీ లేదన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే పంచాయతీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అదనంగా ఎంపీ లాడ్స్ నిధులు, సీఐఆర్ఎఫ్, జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామ పంచాయతీలు, మండలాల్లో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో నగర మాజీ మేయర్ సునీల్రావు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 19 , 2025 | 12:26 AM