‘ఆదర్శం’గా నిలిచారు..
ABN, Publish Date - Jul 04 , 2025 | 01:22 AM
ఆర్థిక రంగంలో ఇల్లంతకుంట అతివలు ఆదర్శంగా నిలిచారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఆర్థిక రంగంలో ఇల్లంతకుంట అతివలు ఆదర్శంగా నిలిచారు. కుటుంబంతో పాటు వ్యాపార రంగాల్లోనూ రాణించగలమని ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్య నిరూపించింది. దేశంలోనే 22 మహిళా సంఘాలను జాతీయ స్థాయిలో ‘ఆత్మ నిర్భర్ సంఘటన్’ అవార్డుకు ఎంపిక చేయగా, తెలంగాణ రాష్ట్రం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్య అవార్డు సాధించింది. ఐకేపీ ద్వారా బ్యాంకు లింకేజీ, స్ర్తీనిధి రుణాలు అందుపుచ్చుకొని వ్యాపార రంగాల్లో రాణిస్తున్న మహిళలు తెలంగాణలో ఇతర స్వశక్తి సంఘాలకు ఆదర్శంగా నిలిచారు. గురువారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖకు లేఖ అందింది. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర వేడుకల్లో ఎర్రకోట వద్ద నిర్వహించనున్న అవార్డుల ప్రదానోత్సవంలో ఆదర్శ మండల సమాఖ్య బాధ్యులు అవార్డును స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళల జీవితాలను గణనీయంగా ప్రభావితం చేసిన స్వయం సహాయక బృందాలు, మండల సమాఖ్యల పనితీరును గుర్తించి దీనదయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గామీణ జీవనోపాధి మిషన్ ‘ఆత్మనిర్భర్ సంఘటన్’ అవార్డులతో ప్రోత్సహిస్తుంది. స్వయం సహాయక సంఘాలకు విశిష్ట సేవలందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్య జాతీయస్థాయి అవార్డుకు ఎంపిక అవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అవార్డులకు దేశంలోని ఆరు రీజియన్ల పరిధిలో 22 క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్లు(సీఎల్ఎఫ్)లు ఎంపిక చేశారు. సదరన్ రీజియన్ కింద తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల ఆదర్శ సమాఖ్య రెండో స్థానంలో నిలిచి ప్రతిభ చూపింది.
విశిష్ట సేవలకు గుర్తింపు..
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలోని ఆదర్శ మండల సమాఖ్య స్వయం సహాయక సభ్యులకు విశిష్ట సేవలందిస్తోంది. ఆదర్శ మండల సమాఖ్య పరిధిలో 46 విలేజ్ ఆర్గనైజేషన్లు ఉండగా, 1103 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటి పనిధిలో 11వేల మందికి పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఆదర్శ మండల సమాఖ్య ఆధ్వర్యంలో గత ఐదేళ్లకు పైగా ఎస్హెచ్జీ సభ్యులకు రుణాలు అందించడం, వాటిని క్రమం తప్పకుండా చెల్లించేలా చూడడం, సభ్యులకు బీమా కల్పించడం తదితర సేవలు అందిస్తోంది. ఎస్హెచ్జీ సభ్యులు వివిధ వ్యాపారాల్లో రాణించేలా నిరంతరం శిక్షణ, సలహాలు అందిస్తున్నారు. అలాగే సామాజిక బాధ్యత కింద అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, నీటి వనరుల సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగించవద్దని, సైబర్ మోసాలకు గురికావద్దని తదితర అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు జీవనోపాదులు పెంచే కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నందుకు అవార్డు దక్కింది.
అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయం..
- సందీప్ కుమార్ ఝా, కలెక్టర్
ఇల్లంతకుంట మండలం ఆదర్శ మహిళా సమాఖ్య ఉత్తమ సేవలందించి జాతీయస్థాయి అవార్డుకు ఎంపికవడం అభినందనీయం. మండల సమాఖ్య బాధ్యులు ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. ఇందుకు కృషి చేసిన సభ్యులందరికీ అభినందనలు..
జాతీయ స్థాయికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది..
- కట్ట సౌమ్య అధ్యక్షురాలు, ఆదర్శ మండల సమాఖ్య
ఇల్లంతకుంట ఆదర్శ మండల సమాఖ్య జాతీయ స్థాయిలో ఆత్మనిర్మర్ సంఘటన్ ఆవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. మండలంలో 11వేల మంది సభ్యులు ఉన్నారు. సభ్యులు రుణాలు తీసుకొని వ్యాపార రంగాల్లో ముందుకు వెళుతున్నారు. సామాజిక కార్యక్రమాల్లోనూ సభ్యులు ఉత్సాహంగా పని చేస్తున్నారు.
Updated Date - Jul 04 , 2025 | 01:22 AM