ప్రభుత్వ కళాశాలల్లో నిఘా నేత్రాలు
ABN, Publish Date - Jul 16 , 2025 | 02:04 AM
రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనా పద్ధతులు, లెక్చరర్ల సమయపాలన, విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది.
జగిత్యాల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనా పద్ధతులు, లెక్చరర్ల సమయపాలన, విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. జిల్లాలోని 16 ప్రభుత్వ కళాశాలల్లో ప్రతీ తరగతి గది, ల్యాబ్, ప్రిన్సిపాల్ గదిలో ఒక్కో సీసీ కెమెరా బిగిస్తున్నారు. ఒక్కో కళాశాలలో పదికి తగ్గకుండా సీసీ కెమెరాలను బిగిస్తున్నారు. జిల్లాకు మొత్తం 160కి పైగా కెమెరాలు అందగా మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, కథలాపూర్, జగిత్యాల బాలురు, జగిత్యాల బాలికలు తదితర జూనియర్ కళాశాలల్లో కెమెరాలు అమర్చారు. ఈ కెమెరాలను నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానిస్తారు. హైదరాబాద్ నుంచి అధికారులు, నిపుణులు బోధనా తీరును పరిశీలించి, లోపాలను సరిదిద్దేందుకు సలహాలు, టైం టేబుల్ అమలు వంటి అంశాలను కూడా ఈ కెమెరాల ద్వారా నిశితంగా పర్యవేక్షిస్తారు.
ఫఫేషియల్ రికగ్నేషన్..
విద్యార్థుల గైర్హాజరు సమస్యను నియంత్రించేందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలు చేయనున్నారు. ప్రతీ గ్రూపునకు ఒక లెక్చరర్ వాట్సాప్ గ్రూప్ ఇన్చార్జీగా ఉంటారు. విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోతే, వారి తల్లిదండ్రులకు సెల్ఫోన్ ద్వారా సమాచారం ఇస్తారు. వారం రోజులకు మించి గైర్హాజరు అయితే లెక్చరర్, ప్రిన్సిపాల్కు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానం విద్యార్థులు కళాశాలకు హాజరయ్యేలా చేయడంతో పాటు డుమ్మాలకు చెక్ పెడుతుంది. అదేవిధంగా ఆదర్శ కళాశాల కమిటీలను ఏర్పాటు చేయడానికి అవసరమైన కసరత్తులు జరుగుతున్నాయి.
ఫమౌలిక సౌకర్యాల కల్పన...
ఏళ్ల తరబడి నిధుల కొరతతో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. జిల్లాలో 11 జూనియర్ కళాశాలలకు రూ.1.08 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో జిల్లాలోని సంబంధిత కళాశాలల్లో విద్యుత్, తాగునీరు, మరమ్మతులు చేపట్టి సౌకర్యాలు కల్పిస్తారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో క్రీడాభివృద్ధికి, క్రీడా సామగ్రి కొనుగోలుకు నిధులు మంజూరు అయ్యాయి. ఒక్కో కళాశాలకు రూ.10 వేల చొప్పున మొత్తంగా రూ.1.60 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. సంబంధిత నిధులతో వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ కిట్స్, షటిల్ కోర్టుకు అవసరమైన నెట్స్, చెస్, క్యారమ్ బోర్డులు తదితర క్రీడా సామగ్రిని కొనుగోలు చేయనున్నారు. బ్లాక్ బోర్డుల స్థానంలో ఇంటర్ ఆక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
పెరుగుతున్న ప్రవేశాలు
-బొప్పరాతి నారాయణ, జిల్లా ఇంటర్ విద్యాధికారి
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉచిత పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన బోధన, మెరుగైన సౌకర్యాలు, విస్తృత ప్రచారం వంటి కారణాలతో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల వైపు మొగ్గుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు అయ్యాయి. క్రీడాభివృద్దికి ఒక్కో కళాశాలకు రూ.10 వేల చొప్పున నిధులు మంజూరు చేసింది.
సంస్కరణలతో పాటు సౌకర్యాలు
-కొట్టాల తిరుపతి రెడ్డి, అధ్యక్షుడు, జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్-475 జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలతో కళాశాలల్లో విద్యాబోధన మెరుగుపడుతుంది. సౌకర్యాలు సమకూరుతాయి. నిధుల మంజూరుతో సమస్యలు దూరం కానున్నాయి. ప్రతీ తరగతి గదిలో సీసీ కెమెరా ఏర్పాటుతో బోధనలో పారదర్శకత పెరుగుతుంది. ఇంటర్ విద్యాశాఖ చేపట్టిన సంస్కరణల వల్ల విద్యార్థులకు మరింత ప్రయోజనం కలుగుతుంది.
Updated Date - Jul 16 , 2025 | 02:04 AM