సర్వీస్ రోడ్లకు మోక్షం
ABN, Publish Date - Aug 01 , 2025 | 12:59 AM
రాజీవ్ రహదారి నిర్మాణం పూర్తయి పదేళ్లుగా టోల్ వసూలు చేస్తున్నా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సర్వీస్ రోడ్ల నిర్మాణం జరుగలేదు.
కోల్సిటీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): రాజీవ్ రహదారి నిర్మాణం పూర్తయి పదేళ్లుగా టోల్ వసూలు చేస్తున్నా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సర్వీస్ రోడ్ల నిర్మాణం జరుగలేదు. దీంతో స్థానికులు రాజీవ్ రహ దారిపై ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. పదేళ్ల కాలంలో 70మందికిపైగా బలయ్యారు. సర్వీస్ రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ ఆవశ్యకత లేకున్నా చిన్న చిన్న కారణాలతో రోడ్డు నిర్మాణానికి అడ్డు చెబు తూ వచ్చారు. రాజీవ్ రహదారి రోడ్డు నిర్మాణ సంస్థ ఇదే అదనుగా సర్వీస్ రోడ్లు వేయకుండా చేతులు దులు పుకుంది. దీంతో స్థానికులు ఏ అవసరం వచ్చినా రాజీవ్ రహదారిపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనాల రద్దీతో తరచూ ప్రమాదాలకు గురయ్యేవారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ చొరవ తీసుకోవడంతో సర్వీస్ రోడ్ల నిర్మాణం ప్రారంభమైంది. రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న భవనాలు, కట్టడాలను యజమానులు స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు.
పదేళ్లుగా పెండింగ్...
రాజీవ్ రహదారి నిర్మాణం 2014లో పూర్తయి జూన్ 2వ తేది నుంచి టోల్ వసూళ్లు ప్రారంభించారు. రాష్ట్ర రహదారి-1గా పిలువబడే రాజీవ్ రహదారి నిర్మాణ సమయంలో గ్రామాలు, పట్టణాల్లో ప్రజల సౌలభ్యానికి సర్వీస్ రోడ్లు నిర్మించాలనే నిబంధన ఉన్నది. రామగుం డం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోదావరిఖని గం గానగర్ నుంచి రామగుండం బీ పవర్హౌస్ వరకు సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కొన్ని చోట్ల రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం చేశారు. గోదావరిఖని గంగానగర్, బస్టాండ్ ఏరియా, కవిత థియేటర్ నుంచి బంగ్లాస్ ఏరియా వరకు, ఎన్టీపీసీ పాత హెలీప్యాడ్ నుంచి టీటీఎస్ గేట్ వరకు నాలుగు ప్రాంతాల్లో పెండింగ్లో ఉంది. రహదారి నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో నిర్మాణం జరిగిన ప్రాంతాలు కూడా ఉపయోగం లేకుండా పోయాయి. ఎల్లంపల్లి ప్రాజక్టు నుంచి రామగుండం మంచినీటి సరఫరా లైన్లను ఈ రహదారి తవ్వే నిర్మించారు. దీంతో ఏ అవసరానికి కూడా వాడని పరిస్థితి ఏర్పడింది.
ప్రమాదాల్లో 70మందికిపైగా మృత్యుతవాత...
రాజీవ్ రహదారికి సర్వీస్ రోడ్లు లేకపోవడంతో రామ గుండం అర్బన్లో పదేళ్ల కాలంలో 70మందికిపైగా మృత్యువాత పడ్డారు. గోదావరిఖని గంగానగర్ వద్ద ట్రాలీ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. గోదావరిఖని బస్టాండ్, మేడిపల్లి చౌరస్తా, కవిత థియే టర్ డౌన్, గంగానగర్లలో జరిగిన ప్రమాదాల్లో రామ గుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సింగరేణి, ఎన్టీపీసీ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లు, యువకులు మరణించారు. ప్రమాదాల తీవ్రత పెరగడంతో సర్వీస్ రోడ్డు నిర్మించాలనే డిమాండ్ ఏర్పడింది. ఇది ఎన్నికల నినాదంగా మారింది.
ఎట్టకేలకు నిర్మాణ పనులు ప్రారంభం...
రాజీవ్ రహదారికి రామగుండంలో సర్వీస్ రోడ్లు నిర్మించాలని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ ఎన్నికైనప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. గోదావరిఖని బస్టాండ్ వద్ద వాణిజ్య భవనంతోపాటు ఇతర నిర్మాణాలను తొలగించారు. వారికి ప్రత్యామ్నాయ స్థలాలను ఇచ్చారు. గోదావరిఖని గంగానగర్లో విస్తరణ చేపట్టారు. కవితా థియేటర్ డౌన్లో లయన్స్క్లబ్ భవనం నుంచి ఇల్లందు క్లబ్ కార్నర్ వరకు నిర్మాణం మొదలుపెట్టారు. ఈ రహ దారిలోని ప్రైవేట్ భవనాలను యజమానులే స్వచ్ఛం దంగా తొలగించుకుంటున్నారు. ప్రశాంత్నగర్ నుంచి శ్రీనగర్కాలనీ రహదారి వరకు కూడా రోడ్డు నిర్మాణం జరిపేందుకు చేపడుతున్నారు. ఎన్టీపీసీ హెలీ ప్యాడ్ రోడ్డు నుంచి టీటీఎస్ గేట్ వరకు కూడా నిర్మాణం జరిపేందుకు కసరత్తు చేస్తున్నారు. రాజీవ్ రహదారి నిర్మాణ సంస్థ హెచ్కేఆర్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు
ఎమ్మెల్యే రాజ్ఠాకూర్
రాజీవ్ రహదారి నిర్మాణ సమయంలోనే సర్వీస్ రోడ్డు, ఫ్లై ఓవర్ల నిర్మాణం జరుగాల్సి ఉంది. అక్కడక్కడ నిర్మించినా అవి ఉపయోగపడడం లేదు. గత పాల కులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఎంతో మంది ప్రమా దాల్లో మరణించారు. హెచ్కేఆర్ సంస్థ ఆర్థికంగా నష్టాల్లో ఉందని చేతులెత్తేసినా వెంట పడి పనులు చేయిస్తున్నాం. కొందరు వ్యాపారులకు ఇబ్బందులు ఎదురవుతున్నా సహకరిస్తున్నారు. భవిష్యత్లో పరిశ్రమలు ఉన్న స్థలాల్లో విస్తరణ చేపడుతాం.
Updated Date - Aug 01 , 2025 | 12:59 AM