జనజీవనం అతలాకుతలం
ABN, Publish Date - Jul 24 , 2025 | 02:35 AM
జిల్లాలో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది.
కరీంనగర్ టౌన్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. కరీంనగర్లో తెల్లవారు జాము నుంచి ఉదయం 9 గంటల వరకు బారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని రహదారులు చెరువులు, కుంటలను తలపించాయి. కరీంనగర్, జగిత్యాల ప్రధాన రహదారిలోని ఆర్టీసీ వర్క్షాప్ సమీపంలో భారీగా వరద నీరు నిలిచి వాహనాలు నీట మునిగాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పరిసర కాలనీల్లోనూ ఇళ్లలోకి, కాలనీల్లోకి వరద నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ సిరిసిల్ల రహదారిలోని రాంనగర్ చౌరస్తాలో వర్షం నీరు నిలవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో భారీగా వరద నీరు చేరి పక్కనే ఉన్న కాలనీలోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. వాణినికేతన్ కళాశాల వెనక ప్రాంతంతోపాటు, మంకమ్మతోట, జ్యోతినగర్, తదితర కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. ఇంట్లోని వస్తువులన్నీ నీటి మునిగాయని ప్రజలు ఆందోళన చెందారు. మంచిర్యాల చౌరస్తాలో చెరువును తలపించే విధంగా నీరు నిలిచింది. శర్మనగర్, ఆదర్శనగర్, ప్రశాంత్నగర్, కార్ఖానాగడ్డ తదితర కాలనీల్లో పెద్ద ఎత్తున వరద నీరు ఇళ్లలోకి చేరింది. కమాన్ చౌరస్తా, కలక్టరేట్, ముకరంపుర, హుస్సేన్పుర, గాయత్రినగర్, శర్మనగర్, లక్ష్మీనగర్, కృష్ణనగర్, కాపువాడ, సెయింట్ జాన్స్ స్కూల్ ఎదుట వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అశోక్నగర్, కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాల్లో కాలనీలు జలమయమయ్యాయి.
ఫ సహాయ చర్యలను పర్యవేక్షించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
వర్షాలతో జనం ఇబ్బందులు పడకుండా చూడాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి, ఎంపీ బండి సంజయ్కుమార్, కలెక్టర్ను ఆదేశించారు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఉన్నతాధికారులు, మాజీ కార్పొరేటర్లు,వివిధ పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు జలమయమైన కాలనీలను సందర్శించి ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచి సహాయక చర్యలు చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ డిసాస్టర్ టీంతోపాటు అధికారుల బృందాలు నగరంలో పలు కాలనీలను, డివిజన్లను పర్యటించి రోడ్లపై నిలిచిన నీటిని మళ్లించారు. ఇళ్లలోకి చేరిన నీటిని తొలగించారు.
ఫ అప్రమత్తంగా ఉండాలి
-మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్
భారీ వర్షాలు కురుస్తున్నందున నగర పాలక సంస్థకు చెందిన డీఆర్ఎఫ్, టౌన్ ప్లానింగ్, సానిటేషన్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఆదేశించారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆయన అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో నుంచి అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. అత్యవసర పరిస్థితి వస్తే నగర పాలక సంస్థ 9849906694 కాల్ సెంటర్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఫ ఉరకలెత్తుతున్న రాయికల్ జలపాతం
’సైదాపూర్: మండలంలోని రాయికల్ జలపాతం రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఉరకలెత్తుతోంది. వంద మీటర్ల ఎత్తు నుంచి పచ్చని చెట్లు, బండ రాళ్ల మధ్య నుంచి నీరు జాలువారుతున్న నీరు సందర్శకులను కనువిందు చేస్తోంది. రాయికల్ నుంచి జలపాతం వరకు వెళ్లే రోడ్డు పూర్తిగా బురుదమయంగా మారింది. దీంతో సందర్శకుల ఇబ్బంది పడుతున్నారు.
ఫ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
కరీంనగర్, జూలై 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులు సహాయం కోసం 0878-2997247 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని సూచించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో సహాయం కోసం 9849906694కు ఫోన్ చేయాలన్నారు. వర్షాల వల్ల జిల్లలో ఎలాంటి ప్రాణ నష్టం, పంట నష్టం జరగలేదని తెలిపారు.
ఫ నీట మునిగిన పొలాలు
మానకొండూర్/సైదాపూర్/శంకరపట్నం/తిమ్మాపూర్/గన్నేరువరం/హుజూరాబాద్: మండలాల్లో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. చెరువులు, కుంటల్లోకి భారీ వరద వచ్చి చేరుతోంది. నాటు వేసిన రెండు మూడు రోజులకే పొలాలన్నీ జలమయం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాగులు పొంగిపొర్లుతున్నాయి. పొలాల ఒడ్లు తెగిపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. సైదాపూర్ మండల కేంద్రంలోని నాలాలు సక్రమంగా లేకపోవడంతో పాత బస్టాండ్ ప్రాంతం జలమయమయింది. శంకరపట్నం మండలం అర్కండ్ల లోలెవెల్ బ్రిడ్జిపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కేశవపట్నం ఎస్సై శేఖర్రెడ్డి వరద ఉధృతి తగ్గేవరకు దారి మూసివేయించారు. ప్రజలు ఎరడపల్లి, గద్దపాక గ్రామాల మీదుగా వెళ్లాలని సూచించారు. అలుగునూర్లో రోడ్లపై నీటిప్రవాహం చెరువును తలపించింది. దీంతో కరీంనగర్, వరంగల్, హైదారాబాద్ వెళ్లే వాహనాదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గన్నేరువరం మండలంలోని పలుగ్రామాల్లో వరదనీటికి డ్రైనేజీలు నిండి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మండలంలోని జంగపల్లి, గునుకుల కొండాపూర్ గ్రామాల్లోని దళితకాలనీల్లో మురుగునీరు ఇళ్లలోకి చేరిందని ఆయా గ్రామాల కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి కూరుకుపోయిన డ్రైనేజీలను శుభ్రం చేయించాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ డివిజన్లో భారీ వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. పొలాలన్నీ రైతుల పనులతో కళకళలాడుతున్నాయి.
మోయతుమ్మెద గలగలలు..
చిగురుమామిడి: మోయ తుమ్మెద వాగు ప్రవాహిస్తే మెట్ట ప్రాంత రైతంగానికి నీటి కష్టాలు తీరినట్టే.. వరుణిడి కరుణపై వ్యవసాయా సాగించే ఈప్రాంత రైతన్నలకు ఇదోక ఈ వాగు ప్రవహిస్తే చుట్టూ ఉన్న బావుల్లో భుగర్బ జలాలు పెంపొంది రెండు పంటలకు సాగునీరు అందుతుంది. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నుంచి చిగరుమామిడి మండలం మూదిమాణిక్యం మీదుగా ఎల్ఎండీలోకి విలీనమవుతుంది. రెండు రోజులుగా కురుసుతన్న వర్షాలకు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దింతో అయా గ్రామాల్లోని రైతులు పంటలు వెయ్యడానకి రైతులు సిద్ధమవుతున్నారు.
Updated Date - Jul 24 , 2025 | 02:35 AM