Karimnagar: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
ABN, Publish Date - Jul 20 , 2025 | 12:21 AM
కరీంనగర్, జూలై 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మహిళలు ప్రభుత్వం ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, జూలై 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మహిళలు ప్రభుత్వం ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ నియోజకవర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాలను శనివారం కళాభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టబడి ఉందని అన్నారు. ఆ దిశగా మహిళలకు ఉపాధి మార్గం చూపడంలో జిల్లా ముందు వరుసలో నిలుస్తోందని తెలిపారు. శుక్రవారం సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని, ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, తద్వారా కుటుంబం అభివృద్ధి చెందాలనేది ఈ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ మహిళల పాత్ర చాలా కీలకమైనదని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కరీంనగర్ అర్బన్లోనే సుమారు 40 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు అందజేశామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో పని చేసే శానిటేషన్ వర్కర్లకు అవసరమయ్యే యూనిఫామ్స్ కుట్టిచ్చే బాధ్యతలు స్వయం సహాయ సంఘాలకు ఇస్తున్నామన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణాలు, లోన్ బీమా, ఆర్టీసీ అద్దె బస్సుల నుంచి వచ్చిన ఆదాయం, యూనిఫామ్స్ కుట్టు చార్జీలు సంబంధించిన చెక్కులను అందజేశారు. బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుని అత్యుత్తమ లాభాలు సాధించిన 12 మంది సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో మెప్మా పీడీ వేణుమాధవ్, డీఆర్డీఓ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 20 , 2025 | 12:21 AM