karimnagar : సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ దృష్టి
ABN, Publish Date - Jun 30 , 2025 | 01:07 AM
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) అధికారంలోకి వచ్చి 18 నెలు గడవడంతో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. ఆ పార్టీ నాయకత్వం ఇటీవలే రాష్ట్ర కమిటీకి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించింది.
- పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్చార్జిల నియామకం
- జిల్లా నేతలకు కమిటీల్లో చోటు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
అధికారంలోకి వచ్చి 18 నెలు గడవడంతో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. ఆ పార్టీ నాయకత్వం ఇటీవలే రాష్ట్ర కమిటీకి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించింది. ఆయా పదవుల్లో ఉన్నవారికి వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల సంస్థాగత ఇన్చార్జిలు, వివిధ విభాగాల ఇన్చార్జి బాధ్యతలను అప్పగించింది. పీసీసీలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారికి వేరే జిల్లాల్లో ఇన్చార్జి బాధ్యతలు లభించగా, ఇతర జిల్లాలకు చెందినవారిని కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమించారు.
ఫ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జిగా నాయిని రాజేందర్రెడ్డి
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని నియమించారు. ఆయనతోపాటు ప్రధాన కార్యదర్శులు మహ్మద్ ఖాజా ఫక్రుద్దీన్, గడ్డం చంద్రశేఖర్రెడ్డి, ఆడెం రాజ్ దేశ్పతి కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గ సంస్థాగత కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా గాలి అనిల్ కుమార్, అతనితోపాటు ప్రధాన కార్యదర్శులు మల్లాడి రాంరెడ్డి, కాశిపాక రాజేశ్, రహ్మత్ హుస్సేన్ను నియమించారు. వీరిలో కాశిపాక రాజేశ్, రహ్మత్ హుస్సేన్కు కరీంనగర్ జిల్లాకు చెందినవారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్కు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. కరీంనగర్ జిల్లాకే చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రుద్ర సంతోష్ కుమార్ను టీపీసీసీ సపోర్ట్ సెంటర్ జవహర్ బాల్మంచ్ ఇన్చార్జిగా నియమించింది. పెద్దపల్లి మాజీ డీసీసీ అధ్యక్షుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈర్ల కొమురయ్యను కిసాన్ కాంగ్రెస్, మత్స్యశాఖ ఇన్చార్జిగా నియమించారు. జిల్లాకు చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు వరంగల్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా చిట్ల సత్యనారాయణ, మోత్కూరి ధర్మారావులతోపాటు బాధ్యతలు నిర్వహించనున్నారు. జిల్లాకు చెందిన మరో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఎమ్మెల్సీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బస్వరాజ్ సారయ్య నేతృత్వంలో మల్కాజిగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఈ నెల 29న వీరిని ఇన్చార్జిలుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - Jun 30 , 2025 | 01:07 AM