పిల్లల వికాసానికి అంగన్వాడీల్లో చేర్పించండి
ABN, Publish Date - Jun 12 , 2025 | 01:01 AM
పిల్లల పరిపూర్ణ మానసిక వికాసానికి, శారీరక ఎదుగుదలకు అంగన్వాడీల్లో చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు పునఃప్రారంభమైన నేపథ్యంలో నగరంలోని కార్ఖానగడ్డ అంగన్వాడి కేంద్రంలో ప్రారంభ వేడుకలను బుధవారం నిర్వహించారు.
- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పిల్లల పరిపూర్ణ మానసిక వికాసానికి, శారీరక ఎదుగుదలకు అంగన్వాడీల్లో చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు పునఃప్రారంభమైన నేపథ్యంలో నగరంలోని కార్ఖానగడ్డ అంగన్వాడి కేంద్రంలో ప్రారంభ వేడుకలను బుధవారం నిర్వహించారు. కొత్తగా అంగన్వాడీలో చేరిన పిల్లల తల్లిదండ్రులను కేంద్రాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని అన్నారు. ఇక్కడ ఆటపాటలతో కూడిన విద్య అందిస్తారని తెలిపారు. ప్రతిరోజూ పోషకాలతో కూడిన ఆహారం అందించడంతోపాటు పిల్లల వయస్సుకు తగిన ఎత్తున, బరువుతో ఉండేలా చూస్తారన్నారు. ఈ నెల 17 వరకు అమ్మమాట.. అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో ఎక్కువ మంది చేరేలా చూడాలని ఐసీడీఎస్ సిబ్బందికి సూచించారు. అంగన్వాడీ పునఃప్రారంభం సందర్భంగా పిల్లలకు ఎగ్ బిర్యానీ సిద్ధం చేయగా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు పిల్లలకు వడ్డించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సీడీపీవో సబిత పాల్గొన్నారు.
ఇందిరమ్మ లబ్దిదారులకు టోకెన్ ద్వారా ఇసుక
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు టోకెన్ పద్ధతిలో ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మైనింగ్, రెవెన్యూ, గృహ నిర్మాణ సంస్థ, ఇంజనీరింగ్ అధికారులతో ప్రభుత్వ భవనాలు, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా విధానంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను మ్యాపింగ్ చేయాలని సూచించారు. లబ్ధిదారుడి గృహ నిర్మాణ అవసరాన్నిబట్టి టోకెన్లు జారీ చేయాలన్నారు.
Updated Date - Jun 12 , 2025 | 01:01 AM