ఓవర్లోడ్తో మట్టి తరలింపు
ABN, Publish Date - May 14 , 2025 | 12:32 AM
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. జిల్లాలో గల ఇటుక బట్టీల యజమానులు, మట్టి మాఫియా కన్ను చెరువుల మట్టిపైనే ఉంటాయి.. నిబంధనలు ఎలా ఉన్నా వాటిని ఎలాగైనా అతిక్రమించి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడమే వారి పని. దీనికి ఈ ఏడాది చెక్ పెట్టాలని భావించిన జిల్లా అధికార యంత్రాంగం టన్నుల లెక్కన గాకుండా ఒక్కో లారీ ట్రిప్పు మట్టికి గంపగుత్తగా రూ.2700 ధర నిర్ణయించింది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. జిల్లాలో గల ఇటుక బట్టీల యజమానులు, మట్టి మాఫియా కన్ను చెరువుల మట్టిపైనే ఉంటాయి.. నిబంధనలు ఎలా ఉన్నా వాటిని ఎలాగైనా అతిక్రమించి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడమే వారి పని. దీనికి ఈ ఏడాది చెక్ పెట్టాలని భావించిన జిల్లా అధికార యంత్రాంగం టన్నుల లెక్కన గాకుండా ఒక్కో లారీ ట్రిప్పు మట్టికి గంపగుత్తగా రూ.2700 ధర నిర్ణయించింది. ఏ ప్రాతిపదికన ఈ ధర నిర్ణయించారే గానీ, ఒక్కో లారీలో ఎంత పరిమాణంలో మట్టి తీసుకపోవాలనే నిబంధన లేకపోవడం ఇటుక బట్టీల యజమానులకు వరంగా మారింది. ఇదే అదునుగా భావిస్తున్న యజమానులు ఓవర్ లోడ్తో పెద్ద ఎత్తున మట్టిని తరలించుకు పోతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. ఓవర్లోడ్ గురించి అధికారులు పట్టించుకోక పోవడంతో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన బీటీ రోడ్లు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే జిల్లా సరిహద్దులోని రామగుండం మండలం, జమ్మికుంట మండలం వావిలాల నుంచి ఒక్కో లారీలో 40 నుంచి 60 టన్నుల ఓవర్లోడ్తో లారీలు వస్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 140 వరకు ఇటుక బట్టీల పరిశ్రమలు ఉండగా యేటా పెద్ద ఎత్తున చెరువుల మట్టి అవసరం ఉంటుంది. ఇక్కడ తయారయ్యే ఇటుకలకు డిమాండ్ ఉంటుంది. వాటి తయారీకి ఉపయోగించే చెరువుల మట్టికి డిమాండ్ ఉంది. దీనిని ఆసరా చేసుకుని రాజకీయ నాయకులు, ఇటుక బట్టీల యజమానుల పేరిట కొంత పరిమాణంలో అనుమతులు తీసుకుని, పెద్ద మొత్తంలో అక్రమంగా మట్టిని తరలించుకు పోతున్నారు. ఈ ఏడాది కేవలం ఇటుక బట్టీల యజమానులకే మట్టి తరలింపునకు అవకాశం ఇస్తుండగా, క్రమంగా బట్టీల యజమానుల పేరిట రాజకీయ నాయకులు మట్టిని తరలించుకు పోయే అవకాశాలు లేకపోలేదు.
ఫ ఒక్కో టన్నుకు రూ.72.80..
గనులు, భూగర్భ శాఖ నిబంధనల ప్రకారం మట్టి తరలించేందుకు అనుమతులు పొందే వాళ్లు టన్నుకు రూ.72.80 ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సి ఉంటుంది. సీనరేజీ పన్నుల కింద 20, పర్మిట్ ఫీజు 16, డీఎంఎఫ్టీ (30 శాతం) 6 రూపాయలు, ఎస్ఎంఈటీ 40 పైసలు, ఐటీ 40 పైసలు, విలేజ్ డెవలప్మెంట్ ఫండ్ కింద 15, అడ్మినిస్ట్రేషన్ ఖర్చుల కింద 15 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గనులు భూగర్భ శాఖాధికారులు ఇచ్చిన అనుమతుల మేరకు చెల్లించిన తర్వాతనే మట్టి తవ్వకాలకు అనుమతులు ఇస్తారు. మట్టి తరలింపును ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకే తరలించాలని, ఓవర్లోడ్తో తరలించకుండా, దారి వెంబడి మట్టి పడకుండా ఉండేందుకు లారీలపై కవర్లు కప్పాలనే నిబంధనలు విధిస్తారు. యేటా నిబంధనలను ఉల్లంఘిస్తూ వచ్చారు. గోరంత అనుమతులు తీసుకుని కొండంత మట్టిని రాజకీయ నాయకుల అండదండలతో తరలించుకు పోయారు. ఈ ఏడాది జిల్లాలో మొదట 14 చెరువుల్లో మట్టిని తరలించుకు పోవచ్చని గుర్తించారు. ఆ తర్వాత మరిన్ని చెరువులను గుర్తించారు.
ఫ శనగకుంటలో 305 ట్రిప్పులకు అనుమతులు..
సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో గల శనగకుంటలో 305 ట్రిప్పుల లారీల మట్టిని తరలించుకు పోయేందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈనెల 9న ఏడుగురు ఇటుక బట్టీల యజమానులకు ప్రొసీడింగ్స్ నంబర్. సీ2/270/2025-5 అనుమతులు ఇచ్చారు. సోమవారం 35 లారీల ట్రిప్పుల మట్టిని తరలించారు. మంగళవారం మరో 25 లారీల్లో మట్టిని తరలిస్తుండగా, ఓవర్లోడ్తో మట్టిని తీసుక పోతున్నారని గ్రామస్థులు అడ్డుకున్నారు. చెరువు కుంట వద్ద మట్టిని లోడ్ చేస్తున్న లారీ నంబర్పై రెవెన్యూ సిబ్బంది వేబిల్లును ఇస్తున్నారు. అందులో ఒక ట్రిప్పు అని మాత్రమే పేర్కొంటున్నారు. ఎంత పరిమాణంలో మట్టిని తీసుక పోతున్నారనే అంశం లేదు. ఇదే అదునుగా భావిస్తున్న ఇటుక బట్టీల యజమానులు ఒక్కో లారీలో 40 నుంచి 50 టన్నుల మట్టిని తరలించుకు పోతున్నారని గ్రామస్థులు తెలిపారు. చెరువుల మట్టి అనుమతుల కోసం కలెక్టర్ కార్యాలయంలో ఇటుక బట్టీల యజమానులు క్యూ కట్టారు. ఈ విధానం ఇలాగే అమలు చేస్తే ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశాలున్నాయి.
మట్టి లారీలను అడ్డుకున్న గ్రామస్థులు
సుల్తానాబాద్ మే 13 (ఆంద్రజ్యోతి): నారాయణపూర్లో మట్టి తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. నారాయణపూర్లోని శనగకుంటకు సంబంధించిన మట్టిని తీసుకుపోవడానికి కలెక్టర్ ఏడుగురు ఇటుక బట్టీల యజమానులకు అనుమతులు ఇచ్చారు. అనుమతుల మేరకు నారాయణపూర్లోని కుంట నుంచి 305 లారీల ట్రిప్లు తీసుకె ళ్లాల్సి ఉంటుంది. మట్టి తరలింపును సోమవారం సుల్తానాబాద్ ప్రాంతానికి చెందిన ఇటుకల బట్టీల యజమానులు ప్రారంభించారు. మొదటిరోజు 35 ట్రిప్పుల మట్టిని తరలించారు రెండో రోజైన మంగళవారం మరో 25 లారీలలో మట్టిని తరలిస్తుండగా నారాయణపూర్ గ్రామస్థులు అడ్డుకున్నారు. కలెక్టర్ ఇచ్చిన అనుమతుల కన్నా ఎక్కువగా మట్టిని తీసుకు వెళ్తున్నారని ఒక్కో టిప్పర్లో 25 టన్నులలోపు తీసుకోవాలని ఉండగా, నలభై టన్నులకు పైగా తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తూ అడ్డుకున్నారు. ఉదయం 10 గంటలకు లారీలను అడ్డుకోగా సాయంత్రం రెవెన్యూ అధికారులు గ్రామానికి వెళ్ళి గ్రామస్థులకు సర్ది చెప్పారు. దీంతో గ్రామస్థులు ఆందోళన విరమించడంతో లారీలు తరలివెళ్ళాయి.
Updated Date - May 14 , 2025 | 12:32 AM