రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Jun 09 , 2025 | 12:54 AM
వేములవాడ రాజన్న ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.
వేములవాడ కల్చరల్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజన్న ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి రాజన్న ఆలయానికి సుమారు 70వేల వరకు భక్తులు తరలివచ్చినట్లు తెలుస్తోంది. ఉదయాన్ని ధర్మగుండంలో భక్తులు పవిత్రస్నానాలు ఆచరించి కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ధర్మదర్శనం, కోడెమొక్కు క్యూలైన్లో భక్తులు సుమారుగా నాలుగు గంటలు నిరీక్షించారు. శీఘ్రదర్శనం, బ్రేక్దర్శనం క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి చేరుకున్న భక్తులు పార్వతిరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్నకు ఎంతో ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకున్నారు. పరివార దేవాలయాల్లో కుంకుమ పూజలో భక్తులు పాల్గొన్నారు. గండాదీపంలో నూనె పోసి గండాలు తొలగిపోవాలని వేడుకున్నారు. అనంతరం అనుబంధ ఆలయాలను దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Updated Date - Jun 09 , 2025 | 12:54 AM