వేములవాడలో కూల్చివేతలు ప్రారంభం
ABN, Publish Date - Jun 16 , 2025 | 12:50 AM
వేములవాడ పట్టణంలో ప్రధాన రోడ్డు వెడల్పు ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది.
వేములవాడ, జూన్ 15 (ఆంధ్రజ్యోతి) : వేములవాడ పట్టణంలో ప్రధాన రోడ్డు వెడల్పు ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాల తొలగింపు చేపట్టారు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముందుభాగం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును 80 అడుగుల మేరకు విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులు, ఇందుకోసం రోడ్డుకు ఇరువైపులా సేకరించాల్సిన ఇళ్లు, భవనాలను గుర్తించారు. 240 మందికి పైగా నిర్వాసితులుగా గుర్తించిన ప్రభుత్వ యంత్రాంగం 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇప్పటికే 60 మందికి పరిహారం చెల్లించింది. కొందరు రోడ్లు వెడల్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా వారికి సంబంధించిన చెక్కులను అధికారులు కోర్టులో డిపాజిట్ చేశారు. రోడ్ల వెడల్పుల్లో నష్టపరిహారం కోసం 47 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయగా, సాధ్యమైనంత త్వరలో రోడ్ల వెడల్పు ప్రారంభించాలన్న లక్ష్యంతో ఆదివారం తొలుత స్థానిక పురపాలక సంఘానికి చెందిన మటన్ మార్కెట్ ప్రాంగణాన్ని జేసీబీ సహాయంతో అధికారులు కూల్చివేశారు. ప్రధాన రోడ్డు వెంబడి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన వాణిజ్య సముదాయం ఉండగా దానిని సోమవారం కూల్చివేయనున్నారు. సోమవారం ఉదయం నుంచి మూడు నాలుగు రోజుల్లోగా రోడ్డుకు ఇరువైపులా సేకరించిన భవనాలను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇళ్లు, భవనాలు ఖాళీ చేయాల్సిందిగా ఇప్పటికే యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు చాలామంది తమ ఇళ్లను ఖాళీ చేయకపోవడంతో సోమవారం తెల్లవారుజాము వరకు ఖచ్చితంగా ఖాళీ చేయాలంటూ అధికారులు ఆదివారం స్పష్టం చేశారు. లేనిపక్షంలో తామే బలవంతంగా తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా రోడ్ల వెడల్పులో భాగంగా కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు రాజన్న ఆలయం ముందు భాగం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు సోమవారం ఉదయం నుంచి 144 సెక్షన్ విధిస్తూ తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్ల వెడల్పులో సేకరించిన ఇళ్లు భవనాలకు కూల్చివేతకు సంబంధించిన పనులు పర్యవేక్షించేందుకు పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే తాము ఇళ్లు ఖాళీ చేయకముందే బలవంతంగా కూల్చివేతకు సిద్ధం కావడం సరైనది కాదని, ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న దుకాణాలను, వాటిలోని సామగ్రిని తరలించడానికి కొంత సమయం ఇవ్వాలని వ్యాపారులు కోరుతున్నారు.
Updated Date - Jun 16 , 2025 | 12:50 AM