కస్టమ్ మిల్లింగ్ నజరానా రూ. 60 లక్షలు
ABN, Publish Date - Jun 04 , 2025 | 03:55 AM
యాసంగి వరిధాన్యం కేటాయింపులను ఆసరాగా చేసుకుని జిల్లా రైస్ మిల్లర్ల సంఘం వసూళ్లకు శ్రీకారంచుట్టింది. సివిల్ సప్లయిస్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు నజరానాలు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతూ ఈ అక్రమ వసూళ్లకు పూనుకున్నట్లు తెలిసింది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
యాసంగి వరిధాన్యం కేటాయింపులను ఆసరాగా చేసుకుని జిల్లా రైస్ మిల్లర్ల సంఘం వసూళ్లకు శ్రీకారంచుట్టింది. సివిల్ సప్లయిస్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు నజరానాలు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతూ ఈ అక్రమ వసూళ్లకు పూనుకున్నట్లు తెలిసింది. జిల్లా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంతోపాటు మంచిర్యాల, నిర్మల్ జిల్లాల నుంచి ఇక్కడికి కస్టమ్ మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యానికి జిల్లా రైస్ మిల్లర్ల సంఘం వసూళ్ల కార్యక్రమం చేపట్టింది. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల నుంచి ప్రత్యేకంగా అధికారులను ఒప్పించి ఇక్కడి మిల్లులకు అదనపు కేటాయింపులు చేయించామని చెబుతూ టన్నుకు 30 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని సమాచారం. జిల్లా నుంచి మిల్లులకు కేటాయించిన ధాన్యానికి టన్నుకు 10 రూపాయల చొప్పున మిల్లర్ల నుంచి వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
ఫ ఇతర జిల్లాల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం
జిల్లాలో యాసంగి సీజన్లో 325 కొనుగోలు కేంద్రాల ద్వారా 3,08,683 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ కోసం ఇక్కడి రైస్ మిల్లులకు కేటాయించారు. జిల్లాలో 110 రైస్ మిల్లులు ఉండగా వాటికి ఈ ధాన్యాన్ని మిల్లింగ్ కోసం కేటాయించారు. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల నుంచి వచ్చిన లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యానికి టన్నుకు 30 రూపాయల చొప్పున 30 లక్షల రూపాయలు, జిల్లాలోని 3,08,683 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టన్నుకు 10 రూపాయల చొప్పున 30 లక్షల రూపాయలు, మొత్తం 60 లక్షల రూపాయల వసూలు చేయాలని జిల్లా రైస్ మిల్లర్ల సంఘం నిర్ణయించిందని తెలిసింది. ఈ సొమ్మును సివిల్ సప్లయిస్, రెవెన్యూ అధికారులకు మామూళ్లుగా అందించాల్సి ఉన్నదని, ఇది ఏటా ప్రతి సీజన్లో జరిగేదేనని చెబుతున్నదని సమాచారం.
ఫ అదనంగా కేటాయించేలా చేశామని చెబుతూ..
మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో రైస్ మిల్లులు ఎక్కువగా లేక అక్కడి ధాన్యాన్ని ఈ జిల్లాకు కేటాయిస్తే తామేదో ప్రత్యేక కేటాయించేలా చూశామని చెబుతూ టన్నుకు 30 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అక్కడి నుంచి వచ్చిన ధాన్యంపైన 20 లక్షల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తున్నదని రైస్ మిల్లర్లు అంటున్నారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా టన్నుకు 10 రూపాయలు ఇస్తారని, సంఘ ప్రతినిధులకు అనుకూలంగా ఉన్న కొన్ని మిల్లులకు అదనపు కేటాయింపులు చేయించి ఎక్కువ మొత్తంలో డబ్బు వసూలు చేస్తారని విమర్శలు ఉన్నాయి. యాసంగి సీజన్లో మొత్తానికి 60 లక్షల రూపాయలు మిల్లర్ల నుంచి వసూలు చేసి అధికారులకు ఇస్తామని చెబుతున్నారని, అందులో ఎవరికి దక్కేదెంతో తెలియదని మిల్లర్లు చర్చించుకుంటున్నారు.
Updated Date - Jun 04 , 2025 | 03:55 AM