అర్ధరాత్రి సీపీ ఆకస్మిక తనిఖీ
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:25 AM
కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు, జిల్లా సరిహద్దుల్లోని చెక్పోస్ట్లను పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం సోమవారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- పశువుల అక్రమ రవాణా నివారణ, పోలీస్ స్టేషన్ల పనితీరును పరిశీలించిన సీపీ
కరీంనగర్ క్రైం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు, జిల్లా సరిహద్దుల్లోని చెక్పోస్ట్లను పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం సోమవారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశువుల అక్రమ రవాణా నివారణకు కమాన్పూర్, వడ్డేపల్లి, మొక్దుంపూర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు చెక్ పోస్టులను ఆయన పరిశీలించారు. చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. తనిఖీల తీరును, తనిఖీలకు సంబంధించిన వాహన వివరాల నమోదు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా చెక్ పోస్టు విధుల్లో ఉన్న సిబ్బందికి వాహన తనిఖీల గురించి బ్రీఫింగ్ ఇచ్చారు. రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత రక్షణ పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. బారికేడింగ్ను సరైన క్రమ పద్ధతిలో అమర్చుకోవాలని సూచించారు. రేడియం రిఫ్లెక్టింగ్ జాకెట్లు ధరించాలని, టార్చ్ లైట్, ఎల్ఈడీ బ్యాటన్ వంటి పరికరాలను రాత్రి సమయాల్లో తప్పనిసరిగా వాడాలని అధికారులు, సిబ్బందిని సీపీ ఆదేశించారు. ప్రతి భారీ వాహనాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు.
ఫ పోలీస్ స్టేషన్లలో
చెక్ పోస్టుల తనిఖీల అనంతరం కరీంనగర్ ఒకటి, రెండు, మూడో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. అర్ధరాత్రి స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. డయల్ 100 ద్వారా అందిన ఫిర్యాదులు, వాటి నమోదు తీరు, సిబ్బంది స్పందనపై ఆరా తీశారు. రాత్రి సమయాల్లో విధుల్లో ఉండే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
Updated Date - Jun 04 , 2025 | 12:25 AM