రోడ్డు ప్రమాదాలకు చెక్
ABN, Publish Date - Jul 09 , 2025 | 01:19 AM
రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా నమోదు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రమాదాల నివారణకు పౌరుల బాధ్యతలపై అధ్యయనం చేసి ప్లాన్ సిద్ధం చేశారు.
జగిత్యాల, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా నమోదు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రమాదాల నివారణకు పౌరుల బాధ్యతలపై అధ్యయనం చేసి ప్లాన్ సిద్ధం చేశారు. రోడ్డు భద్రతా కమిటీకి కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించనుండగా, ఇక నుంచి ప్రతీ నెల సమీక్షలు నిర్వహించనున్నారు. ఎస్పీతో పాటు హైవే అథారిటీ ఆఫీసర్లు, ఆర్అండ్బీ, ట్రాన్స్పోర్టు, ఎన్పీడీసీఎల్, మెడికల్ అండ్ హెల్త్, ఫారెస్టు, అగ్రికల్చర్, మున్సిపల్ అధికారులు కమిటీలో భాగస్వామ్యులుగా ఉంటారు. ప్రమాదాల నివారణకు ఆయా శాఖల పరిధిలో విధులు నిర్వహించనున్నారు.
ఫబ్లాక్ స్పాట్స్పై స్పెషల్ ఫోకస్..
జిల్లా మీదుగా 65వ నంబరు నేషనల్ హైవేతో పాటు పలు ప్రాంతాలను లింక్ చేసే రాష్ట్ర రోడ్లు ఉన్నాయి. గత జనవరి నుంచి జూన్ వరకు జిల్లాలో 251 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 80 మంది ప్రాణాలు కోల్పోయారు. 246 మందికి గాయాలు కాగా ఇందులో వందకు మించి బాధితులు కోలుకోలేక ఇప్పటికీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 2024 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 451 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 426 మంది గాయపడ్డారు. 176 మంది మృతి చెందారు. హైవేపై 80 శాతం రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు అధికారులు జిల్లాలో మొత్తం 43 ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇరుకు బ్రిడ్జిలు, ప్రమాదకరంగా మూల మలుపులు, సిగ్నల్ వ్యవస్థ సరిగా లేకపోవడమే రోడ్డు ప్రమాదాలకు కారణాలుగా గుర్తించారు.
ఫసమస్యల పరిష్కారంపై దృష్టి
అదనపు కలెక్టర్ అధ్యక్షతన ఈనెల 7న కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులతో చర్చించారు. రహదారులను విస్తరించడానికి, ప్రమాదాలను అరికట్టడానికి అందుబాటులో ఉన్న నిధులు, వనరులపై సమీక్షించారు. హైవేలపై వాహనాల స్పీడ్ తగ్గించడానికి బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసి ఫెనాల్టీలు విధించే యోచన చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్ కచ్చితంగా పనిచేసేలా చర్యలు తీసుకోవడం, కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించాలని నిర్ణయించారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి తదితర మున్సిపాలిటీల్లో చౌరస్తాల వద్ద లైన్ క్రాసింగ్ పెయింటింగ్ వేయించడం, ప్రమాదాల నియంత్రణలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచితేనే ఫలితం ఉంటుందని సేఫ్టీ కమిటీ భావిస్తోంది. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు డ్రంకెన్డ్రైవ్ తనిఖీలను రెట్టింపు చేయాలని అధికారులు నిర్ణయించారు. హెల్మెట్, సీట్ బెల్ట్స్ ధరించకపోవడం, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్లో వాహనాలు నడపంపై నిత్యం తనిఖీలు ముమ్మరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఫసీపీఆర్పై పౌరులకు అవగాహన
రోడ్డు ప్రమాదాల నివారణకు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో డిస్ర్టిక్ ట్రాఫిక్ అనాలసిస్ బ్యూరోను ప్రారంభించి ఇతర శాఖల అధికారులను సమన్వయం చేయడం పై అధికారులు దృష్టి సారించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణకు తగు చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో గల హైవేలపై జరిగే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఫస్ట్ రెస్పాండర్స్గా ఉండేందుకు హైవేలపై ఉన్న పెట్రోల్ బంక్ల వారికి, దాబాలో పనిచేసే వారికి, యూత్, గ్రామస్థులకు ఫస్ట్ ఎయిడ్ మరియు సీపీఆర్పై అవగాహన కలిగించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. జిల్లాలో ఉన్న బ్లాక్ స్పాట్స్ను గుర్తించి పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణపై దృష్టి సారించనున్నారు. రోడ్లపై గుంతలు, సైన్ బోర్డులు, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నట్లుగా గుర్తించారు. మైనర్ల డ్రైవింగ్పై ఇటీవల పోలీసులు చర్యలు తీసుకోగా కొంతమేర ఫలితం కనిపిస్తోంది.
అందరి సహకారంతో ప్రమాదాల నివారణ
-సత్యప్రసాద్, కలెక్టర్
రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని వర్గాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముంటుంది. ఆ దిశగా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంతో పాటు పౌరుల భాగస్వామ్యం సైతం ఉండేలా దృష్టి సారించాం. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులను సమన్వయం చేస్తూ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.
రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి
-అశోక్ కుమార్, ఎస్పీ
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాం. పోలీసు శాఖ పరంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ను గుర్తించి జాగ్రత్తలు చేపట్టాం. ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగంతో పాటు పౌరుల భాగస్వామ్యం అవసరం. అందరూ రోడ్డు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలి.
Updated Date - Jul 09 , 2025 | 01:19 AM