దేశానికి రోల్ మోడల్ ‘భూ భారతి’
ABN, Publish Date - May 21 , 2025 | 12:14 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టం దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
సైదాపూర్, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టం దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండలంలోని ఘన్ పూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ భారతి అమలుకు సైదాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా 1600 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. న్యాయపరమైన సమస్యలన్నీ భూభారతి ద్వారా అధికారులు త్వరలోనే పరిష్కరిస్తారన్నారు. ధరణిలో చిన్నచిన్న పొరపాట్లను కూడా సవరించే అవకాశం ఉండకపోయేదన్నారు. భూ భారతిలో భూమి రిజిష్ట్రేషన్ చేసే సందర్భంలోనే సర్వే చేయించి ఆ మ్యాప్ను పాస్ పుస్తకంలో అప్లోడ్ చేస్తామని తెలిపారు. ఈ మ్యాప్ వల్ల భావి తరాలకు ఇబ్బందులు ఉండబోవన్నారు. ఆరువేల మంది సర్వేయర్లకు మూడు నెలలపాటు శిక్షణనిస్తున్నామని తెలిపారు. మండలానికి ఆరు నుంచి ఎనిమిది మంది సర్వేయర్లు పని చేస్తారన్నారు. ఈ నెల 27 నుంచి సర్వేయర్లకు శిక్షణ ఉంటుందన్నారు. జూన్ 2 నుంచి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇక రెవెన్యూ అధికారి చొప్పున విధులు నిర్వహించనున్నారని తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు సరిహద్దు పంచాయతీలు కొలిక్కి వస్తాయన్నారు. ప్రతీ భూమికి భూధార్ నంబర్ వస్తుందని తెలిపారు.
ఫ అన్ని సేవలు ఉచితం
జూన్ 2నుంచి తహసీల్దార్ గ్రామాలకు వస్తారని, భూ సమస్యల దరఖాస్తులు వారికి అందించాలని తెలిపారు. ఒక్క రూపాయి ఫీజు కూడా ఎవరికి చెల్లించాల్సిన పని లేదని, శాశ్వతంగా సమస్య పరిష్కారమవుతుందన్నారు. దరఖాస్తు కూడా ఉచితంగా ఇస్తారని తెలిపారు. 18 రాష్ట్రాల్లో ఆరు నెలల పాటు పర్యటించి మంచి అంశాలను క్రోడీకరించి భూ భారతి చట్టం రూపొందించామన్నారు.
ఫ ప్రతీ పేదవాడికి ఇల్లు
ప్రతీపేదవాడికి గూడు ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టామని, మొదటివిడతలో నాలుగున్నర లక్షల ఇండ్లు మంజూరు చేశామని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. అప్పుల భారం ఉన్నప్పటికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అనంతరం భూభారతిలో భూసమస్యలు పరిష్కారం అయిన వారికి ప్రొసీడింగ్స్ అందజేశారు. సంతోషిమాత మండల సమైక్యకు బ్యాంకు లింకేజీ ద్వారా వచ్చిన 2.13 కోట్ల చెక్కును అందజేశారు. పీఎంఈజీ కింద ంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఫ భూ సమస్యలు పరిష్కరిస్తాం
- మంత్రి పొన్నం ప్రభాకర్
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నఫ్పుడు ధరణి స్థానంలో భూ భారతి తీసుకొస్తామని హామీ ఇచ్చిరని, ఇచ్చిన మాట ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి తెచ్చామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండలంలో భూ సమస్యలను భూభారతి ద్వారా పరిష్కారం చేస్తామన్నారు. చిగురుమామాడి, మానకొండూర్ కాలువ పనులు ప్రాంరంభమవుతాయన్నారు. నియోజకవర్గ సమస్యలు ముఖ్యమంత్రి ఎప్పటికపుఏ్పడు పరిష్కరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, జిల్లా గ్రంథలాయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, సైదాపూర్, కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్లు దొంత సుధాకర్, నిర్మల జయరాజ్, సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, ఆర్డీవో రమేష్బాబు, తహసీల్దార్ గుర్రం శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - May 21 , 2025 | 12:14 AM