ఇక ‘గీత’దాటితే ‘వాత’నే..
ABN, Publish Date - Jun 26 , 2025 | 12:18 AM
కరీంనగర్ క్రైం, జూన్ 25(ఆంధ్రజ్యోతి): వాహనదారులు పారా హుషార్.... సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్, సెల్ఫోన్ రైడింగ్, ఓవర్ స్పీడ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనల నుంచి వాహనదారులు ఇక నుంచి తప్పించుకోలేరు. ఇక నుంచి రోడ్డుపైకి వెళ్లే ప్రతివాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే. లేదంటే జేబులు ఖాళీ అవుతాయి.
- సీసీటీవీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిర్వహణ
- రేపటి నుంచి అమల్లోకి..
- నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు ఆటోమెటిక్ చలాన్ల జారీ
- నగరంలో 769 సీసీకెమెరాలు కమాండ్కంట్రోల్ సెంటర్తో అనుసంధానం
కరీంనగర్ క్రైం, జూన్ 25(ఆంధ్రజ్యోతి): వాహనదారులు పారా హుషార్.... సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్, సెల్ఫోన్ రైడింగ్, ఓవర్ స్పీడ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనల నుంచి వాహనదారులు ఇక నుంచి తప్పించుకోలేరు. ఇక నుంచి రోడ్డుపైకి వెళ్లే ప్రతివాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే. లేదంటే జేబులు ఖాళీ అవుతాయి. నగరంలో శుక్రవారం నుంచి వాహనాల క్రమబద్ధీకరణను ఆటోమేటెడ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టిమ్ ద్వారా నియంత్రించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు బుధవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ కరీంనగర్ బైపాస్రోడ్ వద్ద తీగలవంతెన సమీపంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించారు. సీసీటీవీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్తో వాటి కనెక్టివిటీ, వాటి పనితీరును పర్యవేక్షించారు. కంట్రోల్రూం నుంచి ఆధునిక పద్ధతిలో ట్రాఫిక్ను నియంత్రించవచ్చు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడవచ్చు. నగరంలో ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సిస్టంలో భాగంగా ఎంపిక చేసిన కూడళ్లలో కెమెరాలు, స్పీకర్లు, స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. నగరంలోని నాలుగు కూడళ్లలో ఆటోమేటెడ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టిమ్ ఏర్పాటు చేశారు. ఈ నాలుగు కూడళ్ళలో ఏర్పాటు చేసిన 85రెడ్లైట్ వాయిలేషన్ (ఆర్ఎల్వీఎల్) కెమెరాలు సిగ్నల్ జంపింగ్ చేసిన వాహనాలను గుర్తించి కమాండ్ కంట్రోల్రూంకు సమాచారంతోపాటు, ఫొటోను పంపిస్తుంది. కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని డాటా ఆధారంగా సంబంధిత వాహనదారుడికి చలాన్ రూపంలో జరిమానా సందేశం వెళుతుంది. నగరంలోని 24 కూడళ్లలో ఏర్పాటు చేసిన 174 ఆటోమేటిక్ నంబర్ప్లేట్ రికగ్నైజ్డ్ (ఏఎన్పీఆర్) సీసీ కెమెరాలతో నిబంధనలు ఉల్లంఘించినా లేదా ఏదై ప్రమాదం, చోరీకి సంబంధించిన ఘటనలో వాహనం నంబర్, చిరునామా గుర్తించేందుకు ఈ కెమెరాలు పనిచేస్తాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మరో 335 కెమెరాలు సర్వైలైన్స్ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. 20 చోట్ల పబ్లిక్ అడ్రసింగ్ స్పీకర్లను అమర్చారు. కమాండ్ కంట్రోల్రూం నుంచి కెమెరాల ద్వారా ట్రాఫిక్, ఇతరత్రా ర్యాలీలు, ప్రదర్శనలు, గొడవలు, ఉల్లంఘనలను పరిశీలించే అవకాశం ఉంటుంది. ఆయా కూడళ్లలో ఏర్పాటు చేసిన స్పీకర్ల ద్వారా ప్రజలు, వాహ నదారులను ఉద్దేశించి ఆదేశాలు, సూచనలు జారీచేస్తారు.
ఫ సీసీటీవీ కెమెరాల్లో గుర్తించే ట్రాఫిక్ ఉల్లంఘనలు
- ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, ర్యాష్ డ్రైవింగ్
ఫ నగరంలో ఏర్పాటు చేసినసీసీ కెమెరాల వివరాలు...
- నగరంలోని 110 చోట్ల సర్వైలెన్స్ కెమెరాలు 335లో పీటీజెడ్ కెమెరాలు 35, ఫిక్స్డ్ కెమెరాలు 300
- 85 ఆర్ఎల్వీడీ కెమెరాలు, 174 ఏఎన్పీఆర్ కెమెరాలు,
- 10 చోట్ల స్పీడ్ డిటెక్షన్ కోసం ఏర్పాటు చేసిన 60 కెమెరాల్లో ఎవిడెన్స్ కెమెరాలు 20, ఏఎన్సీఆర్ కెమెరాలు 40.
- 10 చోట్ల రాంగ్రూట్ వాహనాలను గుర్తించేందుకు 30 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో 10 ఎవిడెన్స్, 20 ఏఎన్పీఆర్ కెమెరాలున్నాయి.
- 24 కూడళ్లలో ఏటీసీఎస్ కెమెరాలు 85 ఏర్పాటు చేశారు.
ఫ నగరంలో సుమారు 2,46,500 వాహనాలున్నాయి. ఇందులో ద్విచక్రవాహనాలు 1.85 లక్షల వరకు ఉండగా, ఫోర్వీలర్స్ 45 వేలు, టాక్సీ కారు, ఆటోలు 12 వేలు, హెవీ వెహికల్స్ (లారీ, వ్యాన్) 4,500 వరకు ఉన్నట్లు అంచనా. రోజుకు 1500 వరకు బస్సులు తిరుగుతాయి. నగరంలో 24 గంటల సమయంలో రోజుకు కనీసంగా 50 వేల వాహనాలు రోడ్లపై తిరుగుతుంటాయి.
ఫ పౌరుల భద్రత, ప్రమాదాల నియంత్రణకు చర్యలు
- గౌస్ ఆలం, పోలీస్ కమిషనర్
పౌరుల భద్రతను పెంచడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం, నగరంలో ట్రాఫిక్ను నియంత్రించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు జూన్ 27 నుంచి పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. ఈ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను పర్యవేక్షించి చలాన్లు జారీ చేస్తాం.
ఫ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన సీపీ
స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను పోలీస్కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ బుధవారం సందర్శించారు. కమాండ్ కంట్రోల్రూంలో ఏర్పాటు చేసిన సీసీటీవీలతోపాటు, కంట్రల్ సిస్టంను పరిశీలించారు. శుక్రవారం నుంచి కమాండ్కంట్రోల్ద్వారా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు ప్రారంభిస్తున్న సందర్భంగా ఏర్పాటు, చర్యలపై చర్చించారు. కమాండ్ కంట్రోల్లో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఒకటో ఠాణా సీఐ బిల్ల కోటేశ్వర్, ట్రాఫిక్ సీఐలు కరీముల్లాఖాన్, పర్శ రమేష్, వెంకటేష్ పాల్గొన్నారు.
Updated Date - Jun 26 , 2025 | 12:18 AM