చెన్నూరు లిఫ్ట్ కథ కంచికేనా...?
ABN, Publish Date - May 02 , 2025 | 11:31 PM
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్పల్లి వద్ద ఏర్పాటు చేయదలచిన చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై నీలి నీడలు కమ్ము కున్నాయి.
-ఎత్తిపోతల పథకం భవితవ్యంపై నీలి నీడలు
-రూ. 1658 కోట్ల అంచనా వ్యయంతో రూపకల్పన
-వర్చువల్గా ప్రారంభించిన అప్పటి సీఎం కేసీఆర్
-నిధుల కొరతతో పనులు చేపట్టడంలో జాప్యం
-లక్ష ఎకరాలకు సాగునీటిపై ఆదిలోనే హంసపాదు
-కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుంటే రైతులకు మేలు
మంచిర్యాల, మే 2 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్పల్లి వద్ద ఏర్పాటు చేయదలచిన చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై నీలి నీడలు కమ్ము కున్నాయి. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రత్యేక చొరవతో రూ. 1658 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకున్న పథకం పనులను 2023 జూన్ 9న మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చిన అప్పటి రాష్ట్ర ము ఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్గా ప్రారంభించారు. అయి తే లిఫ్ట్ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం తో పనులు ప్రారంభం కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప రిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్ వాటర్ ఆధారంగా చెన్నూరు లిఫ్ట్కు రూపకల్పన చేశా రు. చెన్నూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో దాదాపు లక్ష ఎకరాలకు నీరందించే లక్ష్యంతో 10 టీ ఎంసీల సామర్థ్యంగల ఎత్తిపోతల పథకానికి ప్రణాళి కలు రూపొందించారు. పథకంలో భాగంగా మొత్తం మూడు లిఫ్ట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లి ఫ్ట్-1 ద్వారా జిల్లాలోని మందమర్రి మండలంలోని పొ న్నారం, శంకర్పల్లి, జైపూర్ మండలంలోని గంగిపల్లి ట్యాంకుల వరకు, లిఫ్ట్-2 ద్వారా భీమారం మండలం ఆరెపల్లి, చెన్నూరు మండలం ఆస్నాద్, రెడ్డిపల్లి ట్యాం కుల వరకు, లిఫ్ట్-3 ద్వారా కోటపల్లి మండలంలోని శం కర్పూర్ ట్యాంక్ వరకు నీళ్లందించేలా డీపీఆర్ తయా రు చేశారు. మూడు లిఫ్ట్ల ద్వారా చెన్నూరు మండ లంలో 31,947 ఎకరాలు, కోటపల్లి మండలంలో 22, 025 ఎకరాలు, భీమారం మండలంలో 10,606 ఎకరా లు, జైపూర్ మండలంలో 19,987 ఎకరాలు, మంద మ ర్రి మండలంలో 5,435 ఎకరాలకు సాగునీరు అందిం చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లిఫ్ట్ ఏర్పాటు చేయడా నికి సుమారు 3వేల ఎకరాలకు పైగా భూములు అవ సరంకాగా వాటిని స్థానిక ప్రజల నుంచి సేకరించను న్నట్లు ప్రకటించారు.
స్థల పరిశీలన జరిపిన మంత్రి, అధికారులు....
చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కోసం అధికారులు డిలెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను కూడా సిద్దం చేశారు. పథకంలో భాగంగా జైపూర్ మండలం శెట్ప ల్లి గోదావరి వద్దగల సుందిళ్ల ప్రాజెక్టు సమీపంలో ఏ ర్పాటు చేయబోయే పంప్హౌజ్ ప్రతిపాదిత స్థలాన్ని 2022 ఫిబ్రవరి 1న అప్పటి రాష్ట్ర దేవాదాయశాఖ మం త్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటి పారుదలశాక ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రద ర్శించిన రూట్ మ్యాప్ను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్తో నియోజకవర్గంలో సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రితో పాటు ఉన్నతాధికారులు ప్రకటించారు కూడా. దీంతో లిఫ్ట్ వచ్చినట్లేనని, టెండర్ ప్రక్రియనే మిగిలి ఉందన్న ప్రచారం జోరుగా జరిగింది. ఇదిలా ఉండగా ప్రాజెక్టు ఏర్పాటు కోసం సర్వేలు నిర్వహించేందుకు దాదాపు రూ. 6.87 కోట్ల వరకు ఖర్చు కూడా చేశారు. లిఫ్ట్ల కోసం ప్రతిపాదిత స్థలంలో భూ సేకరణ, లింక్ చానళ్ల ఏర్పాటు, తదితర అంశాలపై సమీక్ష సమావేశాలు కూ డా నిర్వహించారు. కేటాయించిన బడ్జెట్ను అప్పటి ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పనులు ప్రారం భం కాలేదు. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాకులోని 20వ పిల్లర్ కుంగి పోవడంతో పథకం కంచికి చేరినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఎత్తిపోత ల పథకం నిర్మించేందుకు చొరవ తీసుకుంటే లక్ష ఎక రాలకు సాగు నీరందే అవకాశం ఉందని ఆయకట్టు రైతులు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - May 02 , 2025 | 11:32 PM