Health Department: సనత్నగర్ టిమ్స్కు ఆరోగ్య కార్యదర్శి
ABN, Publish Date - May 22 , 2025 | 07:25 AM
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్థు నేతృత్వంలోని అధికారులు బుధవారం సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆస్పత్రి మౌలిక వసతుల పర్యవేక్షణ, సకాలంలో పనుల పురోగతిని వేగవంతం చేయడానికి సమన్వయ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అధికారులతో కలిసి ఆస్పత్రి నిర్మాణ పనుల పరిశీలన
హైదరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆయా శాఖల ఉన్నత అధికారులంతా ఆస్పత్రుల నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. దీంతో బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్థు నేతృత్వంలో అధికారుల బృందం సనత్ నగర్ టిమ్స్ను సందర్శించింది. ఆస్పత్రి నిర్మాణ పనులను అధికారులు పరిశీలించి అక్కడే నిర్వహించిన సమీక్షలో వివిధ శాఖల మధ్య సమన్వయంతో మిగిలిన పనుల వేగవంతం చేయడానికి అవసరమైన నిర్మాణాత్మక కార్యాచరణ రూపొందించారు. ఆస్పత్రిలో క్లినికల్, మౌలిక వసతుల కల్పన ఎలా ఉండాలన్న అంశంపై నిమ్స్తోపాటు ఏఐజీ, యశోద, కిమ్స్లకు చెందిన సీనియర్ వైద్యుల బృందం అధికారులకు సూచనలు అందించింది. టిమ్స్ను సందర్శించిన వారిలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, డీఎంఈ నరేంద్ర కుమార్, టిమ్స్ నోడల్ అధికారులున్నారు.
Updated Date - May 22 , 2025 | 07:27 AM