Hanumakonda: కళ్లముందే చంపుతుంటే ఎవరూ రాలే!
ABN, Publish Date - Jan 24 , 2025 | 04:16 AM
హనుమకొండలో ఓ ఆటోడ్రైవర్ మరో ఆటోడ్రైవర్ను కత్తితో పొడిచి హతమార్చిన ఘటనను స్థానికులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఈ ఘటన సమయంలో అక్కడున్న సుమారు 20 మంది చోద్యం చూస్తూ ఉండిపోయారు తప్ప అడ్డుకొనే ప్రయత్నమే చేయలేదు.
నాకొక్కరు తోడొచ్చినా రాజ్కుమార్ ప్రాణాలు దక్కేవి
హనుమకొండ హత్య ఘటనపై చంద్రమౌళి ఆవేదన
వరంగల్ క్రైం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): హనుమకొండలో ఓ ఆటోడ్రైవర్ మరో ఆటోడ్రైవర్ను కత్తితో పొడిచి హతమార్చిన ఘటనను స్థానికులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఈ ఘటన సమయంలో అక్కడున్న సుమారు 20 మంది చోద్యం చూస్తూ ఉండిపోయారు తప్ప అడ్డుకొనే ప్రయత్నమే చేయలేదు. పైగా ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. కానీ, పండ్లు విక్రయిస్తూ జీవించే పెండ్యాల చంద్రమౌళి మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆ ఘర్షణను అడ్డుకోబోయిన చంద్రమౌళి గురువారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆ దారుణం గురించి వివరించారు. తనకు ఒకరిద్దరు తోడై ఉంటే రాజ్కుమార్ ప్రాణాలు దక్కేవన్నారు. ‘బుధవారం మఽధ్యాహ్నం రెండు ఆటోలు నిలిపి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటుండగా ఆపడానికి వెళ్లా. వాళ్లలో మాచర్ల రాజ్కుమార్ది, మాదీ మడికొండే. దీంతో గొడవ ఏంటని అడిగా. సర్కిల్లో రెండు ఆటోలు ఒక దానికొకటి తాకినాయనే విషయంలో గొడవ జరుగుతున్నదని రాజ్కుమార్ చెప్పాడు.
అదేసమయంలో వెంకటేశ్వర్లు ఒక్కసారిగా ఆటోలోంచి కత్తి తీసి రాజ్కుమార్పై దాడి చేశాడు. రాజ్కుమార్ను వెళ్లిపొమ్మని చెప్పా.. కానీ, వానివల్ల నాకేమైతదంటూ రాజ్కుమార్.. వెంకటేశ్వర్లు చేతిలో ఉన్న కత్తిని గుంజుకొనే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే వెంకటేశ్వర్లు కత్తితో రాజ్కుమార్ పొట్టలో విచక్షణారహితంగా పొడిచాడు. నేను ఆపే ప్రయత్నం చేస్తుండగా నా భార్య కూడా అక్కడికి వచ్చి అట్ల చూస్తున్నరేంది? ఎవరైనా వచ్చి ఆపండని అరిచినా ఎవరూ దగ్గరికి రాలే. రాజ్కుమార్ పొట్టలో నాలుగు కత్తిపోట్లు పడడంతో స్పృహ తప్పిపడిపోయాడు. ఆ తర్వాత అందరూ వచ్చారు. నాతో పాటు ఇంకొక్కరైనా తోడై ఉంటే రాజ్కుమార్ ప్రాణాలు పోయేవి కాదు. కళ్లముందు అంత దారుణం జరగడం బాధగా ఉంది. ఓ మనిషి ప్రాణం తీస్తుంటే ఎవరూ రాకపోవడం ఇంకా బాధగా ఉంది’ అంటూ చంద్రమౌళి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్రావు
Updated Date - Jan 24 , 2025 | 04:16 AM