Gurukula JEE Success: Vసత్తా చాటిన గురుకుల విద్యార్థులు
ABN, Publish Date - Apr 20 , 2025 | 06:28 AM
జేఈఈ మెయిన్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. బీసీ, ఎస్సీ, గిరిజన గురుకులాల నుండి అనేక మంది అర్హత సాధించి, ముఖ్యంగా నవదీప్, రాజశేఖర్రెడ్డి వంటి విద్యార్థులు అద్భుతమైన పర్సంటైల్ రేట్లు సాధించారు. సీఎం రేవంత్రెడ్డి అభినందించారు.
అభినందనలు తెలిపిన సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. బీసీ గురుకులాల నుంచి 63 మంది అర్హత సాధించగా.. అందులో 32 మంది అబ్బాయిలు, 31మంది అమ్మాయిలు ఉన్నారు. వీరిలో నవదీప్ 97.43, రాజశేఖర్రెడ్డి 94.10, మరో 9 మంది 90కిపైగా పర్సంటైల్ సాధించారు. ఎస్సీ గురుకులాల పరిధిలో 525 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్లో అర్హత సాధించారు. ఆర్.మణిదీప్ 99.03, కె.చరణ్తేజ్ 98.30, రామ్చరణ్ 98.08, బి.తేజస్విని 98.27, కె.కీర్తన 96.71, అఫ్రయాం 97.87 పర్సంటైల్స్ సాధించారు. గిరిజన గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి 398 మంది పరీక్షలో అర్హత సాధించారు. వీరిలో వి.విశాల్ 96.0, నిత్యానాయక్ 95.0 పర్సంటైల్ సాధించారు. జేఈఈ మెయిన్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. ఎంతోమంది విద్యార్థులకు వీరు స్ఫూర్తిగా నిలుస్తారని, రానున్న రోజుల్లో వీరు మరిన్ని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులను బీసీ గురుకులాల కార్యదర్శి సైదులు, ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి, గిరిజన గురుకులాల కార్యదర్శి కె.సీతాలక్ష్మి అభినందించారు.
Updated Date - Apr 20 , 2025 | 06:28 AM