kumaram bheem asifabad- కాలేజీల అభివృద్ధికి నిధులు
ABN, Publish Date - Jul 05 , 2025 | 10:51 PM
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. జిల్లాలో మొత్తం 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటి అభివృద్ధికి రూ. 1.63 కోట్లు మంజూరయ్యాయి.
- మరమ్మతులు, ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు
- జిల్లాకు రూ.1.63 కోట్లు మంజూరు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. జిల్లాలో మొత్తం 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటి అభివృద్ధికి రూ. 1.63 కోట్లు మంజూరయ్యాయి.
బెజ్జూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. నిధులు లేక ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. భవనాల పైకప్పులు పెచ్చులూడుతున్నాయి. శుద్ధజలం, విద్యుత్తు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రిన్సిపాళ్లు సొంతంగా చేతినుంచి డబ్బులు ఖర్చు చేస్తున్నారు. గత పదేళ్ల నుంచి కళాశాలలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయని కారణంగా కళాశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఈక్రమంలో చాలా రోజుల తర్వాత జిల్లాలోని 11జూనియర్ కళాశాలలకు మౌలిక వసతుల కోసం నిధులు మంజూరయ్యాయి. గతంలో ఎన్ఆర్డీపీ ద్వారా ప్రతి ఏటా నిధులు వచ్చేవి. పదేళ్లుగా నిధులు రావడం నిలిచిపోయింది. మూ డు నెలల క్రితం జూనియర్ కళాశాలల పరిస్థితి, అవసరమైన పనులకు సంబంధించి ప్రతిపాధనలపై ప్రభుత్వం కోరింది. దాని ప్రకారం పంపిన ప్రతిపాదనలకు నిధులు మంజూరు కావడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఎట్టకేలకు జూనియర్ కళాశాలల్లో వివిధ రకాల పనులు చేపట్టేందుకు రూ.1.63కోట్ల నిధులు మంజూరు చేసింది.
- తరగతి గదులకు..
కళాశాలలకు మంజూరైన నిధులతో తరగతి గదుల మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో పాటు పారిశుధ్య పనులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుత్కు సంబంధించిన పనులు, త్రాగునీరు, గ్రీన్చాక్ బోర్డు, డ్యూయల్ డెస్క్లు, భవనాలకు రంగులు వంటి పనులు చేయనున్నారు. గతంలో కొన్నిచోట్ల అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు కూడా పూర్తికానున్నాయి. దీంతో కొంతలో కొన్ని సమస్యలు తీరనున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఏ మాత్రం సరిపోకపోయినా కొంతమేర సౌకర్యాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కానీప్రభుత్వం కళాశాలల మరమమ్మతులకు నిధులిచ్చినా నిర్వహణ నిధులు మంజూరు చేయలేదు. సుద్ద ముక్కలు, స్టేషనరీ, రిజిస్టర్లు, జెండా వేడుకలు, ఇతర సమావేశాల ఖర్చులు, పారిశుధ్య నిర్వహణ, హాల్టిక్కెట్ల డౌన్లోడ్ తదితర అవకాశాలకు ఒక్కో కళాశాలకు రూ.20వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చు అవుతోంది. దీంతో నిర్వహణ నిధులు అందించాలని అధ్యాపకులు కోరుతున్నారు. మరమ్మత్తులకు నిధులు మంజూరుతో పాటు కళాశాలల నిర్వహణకు నిధులు మంజూరు చేస్తే బాగుంటుందని అధ్యాపకులు భావిస్తున్నారు.
కేటాయించిన నిధులు ఇలా..
జిల్లాలోని 11ప్రభుత్వ కళాశాలల్లో మరమ్మత్తుల కోసం రూ.1.63కోట్లు నిధులు మంజూరు చేసింది. కళాశాలల వారీగా కాగజ్నగర్కు రూ.28.20లక్షలు, సిర్పూర్(టి)కి రూ.10.60, జైనూర్కు రూ.15.70, కౌటాలకు రూ.20.00, బెజ్జూరుకు రూ.12.60, తిర్యాణికి, 16.80, దహెగాంకు రూ.03.70, ఆసిఫాబాద్కు రూ.15.40, కెరమెరికి రూ. 25.50, వాంకిడికి రూ.03.70, రెబ్బెనకు రూ.11.60లక్షలు నిధులు మంజూరు అయ్యాయి.
కలెక్టర్ ఆదేశాల మేరకు పనులు..
- కళ్యాణి, జిల్లా మాధ్యమిక విద్యాధికారి, ఆసిఫాబాద్
కళాశాలలకు మంజూరైన నిధులను జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పనులు చేయిస్తాం. కళాశాలల మరమమ్మతులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరయ్యాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తాం.
Updated Date - Jul 05 , 2025 | 10:51 PM