మా భూమిని నిర్వాసితులకు కేటాయించొద్దు
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:23 AM
: కొన్నేళ్లుగా తాము సాగుచేసుకుంటున్న భూమిని పెండ్లిపాకల రిజర్వాయర్ భూ నిర్వాసితులకు ఇవ్వాలనే ఆలోచనను విరమించుకోవాలని దేవరోనితండా, జాన్తండా రైతులు డిమాండ్ చేశారు.
న్యాయం చేయాలని రైతుల ధర్నా
నల్లగొండ జిల్లా దేవరకొండలో ఘటన
దేవరకొండ, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): కొన్నేళ్లుగా తాము సాగుచేసుకుంటున్న భూమిని పెండ్లిపాకల రిజర్వాయర్ భూ నిర్వాసితులకు ఇవ్వాలనే ఆలోచనను విరమించుకోవాలని దేవరోనితండా, జాన్తండా రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం ఈమేరకు నల్లగొండ జిల్లా దేవరకొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా జాన్తండా మాజీ సర్పంచ్ రమేష్, రైతులు నాగరాజు, నర్సింహనాయక్, కోట్యానాయక్, బాలునాయక్ మాట్లాడుతూ కొండమల్లేపల్లి మండలంలోని జాన్తండా శివారు సర్వే నంబర్ 86లో ఉన్న 110ఎకరాల ప్రభుత్వ భూమికి అప్పటి ప్రభుత్వం పట్టా, పాస్పుస్తకాలు ఇచ్చినట్లు చెప్పారు. సదరు భూమిలో సాగు చేసుకొని తమ కుటుంబీకులు జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల రెవెన్యూ, నీటి పారుదలశాఖ అధికారులు సర్వేనెంబర్ 86లో 35ఎకరాలు పెండ్లిపాకల రిజర్వాయర్ భూనిర్వాసితులకు పట్టాలు ఇచ్చేందుకు సర్వే చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూములను వదులుకునే ప్రసక్తే లేదని, ఆ ఆలోచనను విరమించుకొని మరో ప్రాంతంలో భూనిర్వాసితులకు భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆర్డీవో రమణారెడ్డి రెవెన్యూ సదస్సులో ఉండటంతో రైతులతో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతానని హామీఇచ్చారు. తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను కలిసి విన్నవిస్తామని రైతులు ఆందోళన విరమించారు.
Updated Date - Jun 04 , 2025 | 12:23 AM