పది నెలల క్రితం అదృశ్యమై..
ABN, Publish Date - Jul 28 , 2025 | 12:34 AM
పది నెలల క్రితం అదృశ్యమైన వ్యక్తిని సూర్యాపేట జిల్లా పోలీసులు ఆదివారం కుటుంబసభ్యులకు అప్పగించారు.
గరిడేపల్లి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): పది నెలల క్రితం అదృశ్యమైన వ్యక్తిని సూర్యాపేట జిల్లా పోలీసులు ఆదివారం కుటుంబసభ్యులకు అప్పగించారు. గరిడేపల్లి పరిధిలోని ఖుతుబ్షాపురం గ్రామానికి చెందిన షేక్ జాన్సైదులుకు కోదాడ పట్టణానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. కోదాడలో అత్తగారి ఇంటి వద్ద ఉంటూ లారీ డ్రైవర్గా పని చేసేవాడు. 10 నెలల క్రితం కోదాడలో భార్య, అత్త, మామాలతో గొడవ పడి స్వగ్రామం ఖుతుభ్షాపురం వచ్చాడు. అక్కడ నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. భార్య, అత్త, మామాల బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఫిబ్రవరి నెలలో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. జాన్సైదులు లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఇతర రాష్ట్రాలకు, అక్కడ నుంచి సమీప దేశాల్లో వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో లారీ లోడు దించేందుకు భూటాన్ దేశానికి వెళ్లిన జాన్సైదులు అక్కడే ఉండి లారీని మరో డ్రైవర్తో పంపించాడు. తరుచూ లారీ లోడ్లతో భూటాన్ పరిసర ప్రాంతాలకు వెళ్లడంతో గతంలో అక్కడి వారితో పరిచయం కావడంతో అక్కడే మొక్కజొన్న ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగించాడు. తరుచూ ఫోన్ సిమ్కార్డు మార్చడంతో పోలీసులకు కూడా అతని ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా జాన్సైదులును ఇండియాకు రప్పించారు. 20 రోజుల క్రితం జాన్సైదులు హైదరాబాద్ రాగా, పోలీసులు అతన్ని పట్టుకొని ఎట్టకేలకు జాన్సైదులును కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చలికంటి నరేష్, పోలీసు సిబ్బంది నాగేష్, విష్ణు, వెంకటేశ్వర్లు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 28 , 2025 | 12:34 AM